చిన్న సినిమాల కొత్త ‘ఫార్ములా 99’

తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల గురించి కొన్నేళ్ల నుంచి పెద్ద చర్చే జరుగుతోంది. ఏపీలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా మరీ అన్యాయంగా రేట్లు తగ్గించేయడంతో ఇండస్ట్రీ గగ్గోలు పెట్టింది. తర్వాత రేట్లు సవరించారు. అవి ఇటు ప్రేక్షకులకు, అటు ఇండస్ట్రీ జనాలకు రీజనబుల్‌గా అనిపించి ఆల్ హ్యాపీస్ అన్నట్లు కనిపించింది. 

కానీ క్రేజున్న సినిమాలకు ఉన్న రేట్ల మీద అదనంగా వడ్డిస్తుండడం పట్ల ప్రేక్షకుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. అంతకంతకూ థియేటర్లకు వచ్చేవారి సంఖ్య తగ్గుతుండడానికి టికెట్ల ధరలు కూడా ఒక కారణం అనే వాదన బలంగా వినిపిస్తోంది. ఇలాంటి టైంలోనే ప్రభుత్వం నిర్దేశించిన సాధారణ ధరల కంటే రేట్లు తగ్గించి ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు చిన్న సినిమాల మేకర్స్.

ఇటీవల ‘రాజు వెడ్స్ రాంబాయి’ అనే చిన్న చిత్రాన్ని సింగిల్ స్క్రీన్లలో రూ.99, మల్టీప్లెక్సుల్లో రూ.150 టికెట్ల ధరలతో రిలీజ్ చేశారు. ఈ ఆలోచన మంచి ఫలితమే ఇచ్చింది. ఆ రేట్లు ఉన్న రోజుల్లో ఆక్యుపెన్సీలు బాగా కనిపించాయి. సినిమాకు ఎబోవ్ యావరేజ్ టాక్ రాగా.. ఆ టాక్‌ను మించే జనం సినిమాను చూశారు. రేట్లు తగ్గడం వల్ల ఒక టికెట్ మీద వచ్చే ఆదాయం తగ్గినా.. ఆక్యుపెన్సీలు పెంచుకోవడం ద్వారా అంతిమంగా లాభమే పొందారు నిర్మాతలు.

ఈ ఫార్ములాను వేరే చిత్రాల మేకర్స్ కూడా అనుసరించే ప్రయత్నం చేస్తున్నారు. క్రిస్మస్ వీకెండ్లో రిలీవుతున్న వాటిలో దండోరా, ఈషా చిత్రాలకు కూడా 99, 150 రేట్లను అమలు చేయబోతున్నారు. ఈ రెండు చిత్రాల మేకర్స్ ఈ మేరకు ప్రకటన చేశారు. ‘రాజు వెడ్స్ రాంబాయి’ని రిలీజ్ చేసిన బన్నీ వాసు, వంశీ నందిపాటిలే ‘ఈషా’ను కూడా విడుదల చేస్తున్నారు. కాబట్టే సేమ్ ఫార్ములా ట్రై చేస్తున్నారు. ‘దండోరా’ టీం సైతం ఇవే రేట్లతో సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది.