చరణ్ చిరులని దాటొచ్చిన గంభీర

సాహో ఫలితం ఏమయ్యిందనేది పక్కనపెడితే దర్శకుడు సుజిత్ అంత గ్యాప్ తీసుకుని ఉండకూడదనేది ఫ్యాన్స్ లో ఉన్న అభిప్రాయం. అదేమీ ఆదిపురుష్ అంత డిజాస్టర్ కాదు. ఒక్క హిందీ వెర్షన్ నుంచే నూటా డెబ్భై కోట్లు రాబట్టింది. కేవలం టీజర్ చూసే షారుఖ్ ఖాన్ తన ఇంటికి సుజిత్ ని ఆహ్వానించాడనే టాక్ అప్పట్లో ముంబై వర్గాల్లో బలంగా చక్కర్లు కొట్టింది. అయితే ఇంత సుదీర్ఘమైన విరామం వెనుక తెలియని స్టోరీ చాలా ఉంది. ఓజి పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లకు అందుబాటులోకి వచ్చిన సుజిత్ దానికి సంబంధించిన కబుర్లను పంచుకుంటున్నాడు. మా ప్రతినిధితో కొన్ని ఎక్స్ క్లూజివ్స్ చెప్పాడు.

ఆశించిన రిజల్ట్ సాహో నుంచి దక్కకపోయినా సుజిత్ నిరాశపడలేదు. కథలు రాసుకోవడంలో బిజీ అయ్యాడు. రామ్ చరణ్ తో ఒక స్క్రిప్ట్ ఓకే అయ్యింది. యూకే బ్యాక్ డ్రాప్ లో షూటింగ్ మొత్తం అక్కడే జరిగేలా ప్లాన్ చేసుకున్నారు. సరిగ్గా అదే సమయానికి కోవిడ్ రావడం, విదేశాల్లో ఇకపై చిత్రీకరణలు ఉండవని పుకారు పుట్టడంతో ఆ ప్రాజెక్టు ఆగిపోయింది. తర్వాత లూసిఫర్ రీమేక్ కోసం చరణ్ ద్వారా చిరంజీవి నుంచి పిలుపు వచ్చింది. కొంత కాలం వర్క్ చేశాక ఇది సూటవ్వదని సుజిత్ భావించాడు. పైగా ఒరిజినల్ తీసిన పృథ్విరాజ్ సుకుమారన్ సాహో వర్క్ ని మెచ్చుకోవడం గుర్తొచ్చింది. దీంతో డ్రాప్ అయ్యాడు.

తర్వాత ఒక బాలీవుడ్ స్టార్ హీరో నుంచి కాల్ రావడంతో సుజిత్ ముంబై వెళ్ళిపోయి ఆ పనుల్లో బిజీ అయ్యాడు. ఇంకో మూడు నెలల్లో షూట్ మొదలుపెట్టాలి అన్న టైంలో త్రివిక్రమ్ ద్వారా నిర్మాత డివివి దానయ్య నుంచి ఫోన్ వచ్చింది. పవన్ కళ్యాణ్ కోసం ఏదైనా కథ ఉందా అంటూ.. ఇంకేముంది తాను ఎవరినైతే వీరాభిమానిస్తున్నాడో ఆయనతో చేసే అవకాశం లైఫ్ టైం అనిపించింది. అంతే ముంబై హీరోకి గుడ్ బై చెప్పేసి హైదరాబాద్ వచ్చేసి ఓజికి శ్రీకారం చుట్టాడు. ఒకవేళ చరణ్ చిరులతో కనక సుజిత్ ముందుకు వెళ్లి ఉంటే ఈ ఓజి బాగా లేట్ అయ్యేదేమో. అంతే రాసిపెట్టి ఉన్నప్పుడు ఇలాగే జరుగుతాయి.