కాపీ సినిమా టార్చర్ పెడుతోందట

యానిమల్, మార్కోని స్ఫూర్తిగా తీసుకుని వయోలెన్స్ ఉంటే చాలు ఆడియన్స్ ఎగబడి చూస్తారనే భ్రమలో తీసిన బాలీవుడ్ మూవీ భాగీ 4. ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మాస్ ఆడియన్స్ లో ఈ ఫ్రాంచైజ్ కున్న క్రేజ్ దృష్ట్యా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే జరిగాయి. పివిఆర్ ఐనాక్స్ మల్టీప్లెక్సుల్లో మొదటిరోజుకు ముందే లక్షన్నర టికెట్లు అమ్ముడుపోవడం విశేషమే. కన్నడ దర్శకుడు హర్ష (గోపీచంద్ భీమా తీసింది ఈయనే) కి హిందీ డెబ్యూ ఇది. ఇలా చెప్పుకోదగ్గ హైప్ తో వచ్చిన భాగీ 4 మీద హిందీ రివ్యూయర్లు విరుచుకుపడుతున్నారు. దారుణంగా టార్చర్ పెట్టిన సినిమాగా ఒకటి రెండు రేటింగులు ఇచ్చి చెడుగుడు ఆడేశారు.

ఇంతా చేసి ఇదేమి ఒరిజినల్ కథ కాదు. 2013లో ప్రేమిస్తే భరత్ హీరోగా అయింతు అయింతు అయింతు అనే సినిమా వచ్చింది. అప్పటిదాకా ఫ్లాపుల్లో ఉన్న భరత్ కు మంచి కంబ్యాక్ అయ్యింది. ఆ ఏడాది టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. ఆ పాయింట్ ని యధాతథంగా భాగీ 4లో వాడుకున్నారు. ఏడు నెలల కోమా నుంచి బయటికి వచ్చిన హీరో అలియాస్ టైగర్ శ్రోఫ్ గతాన్ని మర్చిపోతాడు. లేని ప్రియురాల్ని ఊహించుకుంటూ వింతగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అప్పుడే విలన్ చాకో అలియాస్ సంజయ్ దత్ ఎంట్రీ ఇస్తాడు. అసలు టైగర్ జీవితంలో ఏం జరిగింది, ఎవరు ఇదంతా చేశారనేది ఈజీగా ఊహించుకోవచ్చు .

ఇలా ఆసుపత్రి బెడ్ మీద నుంచి హఠాత్తుగా లేచి గతాన్ని వాడుకోవడమనే పాయింట్ ని గోపీచంద్ ఒంటరిలో ఎప్పుడో వాడారు. కానీ ఆ సినిమా ఆడలేదు. బాలకృష్ణ లయన్ లోనూ ఇలాంటి ఎపిసోడ్ ఉంటుంది. అదీ ఫ్లాపే. ఇప్పుడు భాగీ 4 వంతు వచ్చింది. విపరీతమైన హింస, లక్షల బుల్లెట్లు, కత్తిపోట్లు హీరో విలన్ ని ఏం చేయవు కానీ వందల వేల సంఖ్యలో రౌడీలు మాత్రం పిట్టల్లా ఎగిరిపోతుంటారు. జుగుప్స అనిపించే సన్నివేశాలకు లోటు లేకుండా డైరెక్టర్ భరించరాని హింసని చూపించి థియేటర్ జనాలను హింసించేశారు. మరి నార్త్ ప్రేక్షకులు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారో వేచి చూడాలి.