బాలీవుడ్ లో ఇప్పుడు అంతో ఇంతో గ్యారెంటీ మార్కెట్ ఉన్న హీరో ఎవరయ్యా అంటే అజయ్ దేవగన్ పేరే వినిపిస్తుంది. వేగంగా సినిమాలు చేస్తూ బోల్తాలు ఎక్కువ కొడుతున్న అక్షయ్ కుమార్ కన్నా అజయ్ మీద పెట్టుబడే సేఫ్ అంటున్నారు నిర్మాతలు. ఈయన కొత్త మూవీ సన్నాఫ్ సర్దార్ 2 ముందు ప్రకటించిన ప్రకారం జూలై 25 విడుదల కావాలి. ఆ మేరకు ఏర్పాట్లు చేసుకుని డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం ఇచ్చారు. అయితే ట్రైలర్ కు ఆశించిన స్థాయిలో పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రాలేదు. మొదటి భాగం (మర్యాద రామన్న రీమేక్) పేరుని చెడగొడుతున్నారనే కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి. దీంతో టీమ్ కొత్త ట్రైలర్ రెడీ చేస్తోంది.
అసలు మ్యాటర్ ఇది కాదు. ఇప్పుడీ సన్నాఫ్ సర్దార్ 2 వాయిదా పడింది. ఆగస్ట్ 1 రిలీజ్ చేయబోతున్నట్టు తాజాగా ప్రకటన ఇచ్చారు. ఎందుకిలా అంటే ముంబై వర్గాల్లో రెండు కథనాలు వినిపిస్తున్నాయి. మొదటిది సైయారా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబోతోంది. చాలా గ్యాప్ తర్వాత వచ్చిన లవ్ ఎంటర్ టైనర్ కావడంతో ఉత్తరాది రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చూస్తున్నారు. గంటకు ఇరవై నుంచి ముప్పై వేలకు పైగా బుక్ మై షో టికెట్లు అమ్ముడుపోతున్నాయి. ఈ ఊపు ఇంకో పది రోజుల దాకా ఉంటుందని ట్రేడ్ అంచనా వేస్తోంది. అదే జరిగితే సన్నాఫ్ సర్దార్ 2 చూసే మూడ్ కి జనాలు రాలేరు.
అయినా కొత్త హీరో నటించిన సినిమా టాక్ కు జడిసి బడా స్టార్ వెనక్కు తగ్గడం అరుదని చెప్పాలి. పైగా ట్రైలర్ కంటెంట్ చూశాక వచ్చిన నెగటివ్ ఫీడ్ బ్యాక్ మీద వర్క్ చేయాలని నిర్ణయించుకోవడం మంచి నిర్ణయం. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ ఎంటర్ టైనర్ కథ విదేశాల్లో జరుగుతుంది. కామెడీ పేరుతో మరీ నేలబారు హాస్యం రాసుకున్నారని విమర్శకులు తలంటారు. ఇప్పుడో రెండు వారాల సమయం దొరికింది కాబట్టి ప్రమోషన్లు నెమ్మదిగా చేసుకుంటారు. అన్నట్టు సన్నాఫ్ సర్దార్ 2 పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు కాంపిటీషన్ తప్పించుకున్నా విజయ్ దేవరకొండ కింగ్డమ్ ని ఫేస్ చేయక తప్పదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates