టీ20లకు మరో భారత క్రికెటర్ గుడ్ బై

టీ20 క్రికెట్ ప్రపంచ కప్ 2024ను టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్ పోరులో సఫారీ జట్టుపై రోహిత్ సేన చిరస్మరణీయ విజయం సాధించింది. ఎంతోకాలంగా ఫామ్ లేమితో ట్రోలింగ్ ఎదుర్కొంటున్న కింగ్ విరాట్ కోహ్లీ తన కెరీర్ లో మరో అద్భుతమైన ఇన్నింగ్స్ తో జట్టును గెలిపించాడు. 2023 వన్డే క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్లో ఓటమి అవమాన భారంతో కుంగి పోతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు కూడా ఈ ప్రపంచ కప్ చాలా స్పెషల్. అందుకే వారంతా కప్ గెలవగానే తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆ తర్వాత ఈ ఇద్దరు ఆటగాళ్లు పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెబుతున్నామని సంచలన ప్రకటన చేశారు.

వయసు రీత్యా మరో రెండేళ్ల తర్వాత జరిగే ప్రపంచ కప్ సమయానికి వీరిద్దరి స్థానాల్లో కొత్తవారికి చోటు దక్కితే బాగుంటుందన్న వాదన చాలాకాలంగా ఉంది. ఆ ప్రచారం ప్రకారమే రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించారు. తాజాగా ధనాధన్ క్రికెట్ కు కోహ్లీ, రోహిత్ ల బాటలోనే ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా కూడా టాటా చెప్పేశాడు. టీ20 క్రికెట్ కు గుడ్ బై చెబుతున్నానని జడ్డూ ప్రకటించాడు. గుండెనిండా కృత‌జ్జ‌తాభావంతో టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు ప‌లుకుతున్నానని అన్నాడు. తన కెరీర్ ను ఎంతో గ‌ర్వంగా ముగిస్తున్నానని, దేశానికి ఆడిన ప్ర‌తిసారి తన అత్యుత్త‌మ ప్ర‌తిభ క‌న‌బ‌రిచానని జడ్డూ భావోద్వేగంతో అన్నాడు.

మిగ‌తా ఫార్మాట్ల‌లోనూ అదే త‌ర‌హాలో ఆడాతానని చెప్పాడు. పొట్టి ప్ర‌పంచ క‌ప్ గెల‌వాల‌నే క‌ల నిజ‌మైందని, టీ20 కెరీర్‌లో ఇదో గొప్ప ఘ‌ట్టమని చెప్పాడు. ఇన్ని రోజులు తనకు మ‌ద్దతుగా ఉన్న అభిమానులంద‌రికీ ధ‌న్య‌వాదాలు చెబుతూ జడ్డూ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.