కుమారి ఆంటీ తర్వాత ఈ అమ్మాయి

హైదరాబాద్‌ హైటెక్ సిటీ ప్రాంతంలో రోడ్డు పక్కన నాన్ వెజ్ మీల్స్ అమ్మే సాయికుమారి అలియాస్ కుమారి ఆంటీ విషయంలో ఆ మధ్య ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. కుమారి ఆంటీకి కొంచెం పాపులారిటీ రాగానే సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబ్ ఛానెళ్ల వాళ్లకు తోడు మెయిన్ స్ట్రీమ్ మీడియా సైతం అక్కడే తిష్ట వేసి.. ఆమెకు ఎక్కడ లేని కవరేజీ ఇచ్చారు. దీంతో జనాలు పోటెత్తి ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయి కుమారి ఆంటీ ఫుడ్ బిజినెస్ క్లోజ్ అయ్యే పరిస్థితి వచ్చింది.

కానీ కుమారి ఆంటీకి సోషల్ మీడియాలో వచ్చిన పాపులారిటీ, ఆమె బిజినెస్ క్లోజ్ చేయాలన్న నిర్ణయంపై వచ్చిన వ్యతిరేకత చూసి స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమె పట్ల సానుకూలంగా మాట్లాడడంతో ముప్పు తప్పింది. లేదంటే సోషల్ మీడియా, మీడియా జనాల ధాటికి కుమారి ఆంటీ బిజినెస్సే మూతపడేది.

ఇప్పుడు ఇంకో లేడీ స్ట్రీట్ ఫుడ్ వెండార్‌కు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తన పేరు.. చంద్రిక దీక్షిత్. ఆమె ఢిల్లీలోని సైనిక్ విహార్‌లో రోడ్డు పక్కన ఫుట్ పాత్ మీద వడాపావ్ స్టాల్ నడుపుతోంది. అందంగా ఉండి చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తుండటంతో ఆమెపై సోషల్ మీడియా దృష్టిపడింది.

తన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అయ్యాయి. దీంతో ఢిల్లీ కార్పొరేషన్ అధికారుల దృష్టి ఆమెపై పడింది. లైసెన్స్ లేదని, ఇంకేవో కారణాలు చెప్పి ఆమె స్టాల్‌ను అక్కడి నుంచి తీసేయాలని అధికారులు చెప్పారు. స్టాల్ తీయించడానికి వచ్చిన అధికారుల వద్ద ఏడుస్తూ.. వాళ్లకు మోకాళ్లపై వంగి దండాలు పెడుతున్న చంద్రిక వీడియోలు వైరల్ అయ్యాయి. ఆమెకు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సపోర్ట్ వచ్చింది. అధికారులు తనను లంచం అడిగారని చంద్రిక మీడియాకు చెప్పింది. కానీ అధికారులు మాత్రం.. లైసెన్స్ తీసుకుని అధకారికంగా స్టాల్ నడుపుకోవాలని మాత్రమే తాము చెప్పామని అంటున్నారు.