“కొబ్బరికాయ కొట్టాం… గుమ్మడి కాయ కట్టాం”

ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం పేరిట నెలకొల్పిన ఈ ఎయిర్ పోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉగ్వేభపూరిత ప్రసంగం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును సమూలంగా మార్చనున్న భోగాపురం ఎయిర్ పోర్టుకు కొబ్బరి కాయ కొట్టడంతోనే తాను ఆగిపోలేదని, ఆ ఎయిర్ పోర్టును పూర్తి చేసి దానికి గుమ్మడి కాయ కూడా తానే కట్టానని చంద్రబాబు అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుకు కొబ్బరికాయ కొట్టాం.. గుమ్మడి కాయ కట్టాం అంటూ ఆయన పవర్ ఫుల్ పంచ్ లు సంధించారు.

భోగాపురం ఎయిర్ పోర్టు రాష్ట్రానికి కొత్త దశ, దిశలను నిర్దేశించనుందని చంద్రబాబు అన్నారు. అంతేకాకుండా ఇప్పటిదాకా ఉత్తరాంధ్ర నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు వెళుతూ ఉంటే…భోగాపురం ఎయిర్ పోర్టుతో ఇతర ప్రాంతాల నుంచి ఉత్తరాంధ్రకు వలసలు ప్రారంభం కావడం ఖాయమని ఆయన అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు వైపు యావత్తు ప్రపంచం చూస్తోందన్న చంద్రబాబు… ఈ ఎయిర్ పోర్టు కారణంగా ఉత్తరాంధ్ర యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెండుగా లభించనున్నాయని తెలిపారు.

ఈ సందర్భంగా చంద్రబాబు ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములను ఉత్తరాంధ్ర రైతులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్న చంద్రబాబు… ఎయిర్ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూములిచ్చిన రైతులకు పాదాభివందనం చేస్తున్నానని పేర్కొన్నారు. ఇక ఉత్తరాంధ్ర రూపురేఖలను మార్చనున్న భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం చేపట్టింది కూడా ఉత్తరాంధ్రకు చెందిన జీఎంఆరేనని ఆయన గుర్తు చేశారు. ఇక భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణాన్ని రికార్డు వ్యవధిలో పూర్తి చేయించిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ఉత్తరాంధ్రకు చెందిన వారేనని ఆయన అన్నారు. ఇక భోగాపురం ఎయిర్ పోర్టుకు తొలి అడుగు వేసిన అశోక్ గజపతి రాజు కూడా ఉత్తరాంధ్రకు చెందిన వారేనన్నారు. 

కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లలోనే ఏపీ రూపురేఖలు మారిపోయాయన్న చంద్రబాబు… ఈ పెట్టుబడుల్లో ఉత్తరాంధ్రకే మెజారిటీ వాటా దక్కిందని గుర్తు చేశారు. గూగుల్ తో పాటు స్టీల్ కంపెనీలు ఉత్తరాంధ్రలో పెట్టుబడులు పెట్టాయని, తాజాగా భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్రకు మరిన్ని పెట్టుబడులు రానున్నాయని ఆయన అన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుతో ఉత్తరాంధ్రకే కాకుండా యావత్తు ఏపీకి రవాణా మరింత సులభతరం కానుందని ఆయన పేర్కొన్నారు. భోగాపురం ఎయిర్ పోర్టుతో ఏపీ పారిశ్రామిక భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చంద్రబాబు తెలిపారు.