పీచు మిఠాయి అమ్మినా, తిన్నా నేరమే !

పీచు మిఠాయి. ఈ ప‌దార్థం గురించి తెలియ‌నివారు ఉండ‌రు. తిన‌నివారు అంత‌క‌న్నా ఉండ‌రు. అయితే, ఇప్పుడు హ‌ఠాత్తుగా పీచు మిఠాయి వార్త‌ల్లోకి వ‌చ్చింది. రావ‌డ‌మే కాదు.. సంచ‌ల‌నంగా మారింది. అదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల్లోనూ భ‌యానికి కార‌ణ‌మైంది. దీనికి రీజ‌న్‌.. పీచు మిఠాయి త‌యారీలో ఉప‌యోగించే ప‌దార్థాల్లో క్యాన్స‌ర్ కార‌కాలు ఉన్నాయ‌ట‌! అంతే.. ఈ విష‌యం బ‌య‌ట‌కు రాగానే త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం వెంట‌నే దీనిపై నిషేధం విధించింది. పీచు మిఠాయిని త‌యారు చేసినా.. విక్ర‌యించినా.. చివ‌ర‌కు చాటు మాటుగా తిన్నార‌ని తెలిసినా.. క్ర‌ిమిన‌ల్ చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు ఉత్త‌ర్వులు కూడా జారీ చేసింది.

రాష్ట్రంలో పీచు మిటాయి విక్రయాలపై నిషేధం విధిస్తున్నట్లు త‌మిళ‌నాడు ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్‌ వెల్లడించారు. వీటిల్లో క్యాన్సర్‌ కారక రసాయనాలు ఉన్నాయని పరిశోధనల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల రాష్ట్ర‌ ఫుడ్‌ సేఫ్టీ విభాగం అధికారులు చెన్నై వ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. పీచు మిఠాయి న‌మూనాల‌ను స్వాధీనం చేసుకున్నారు. వాటిని ల్యాబుల‌కు పంపించి.. క్షుణ్నంగా ప‌రిశీలించారు. కాటన్‌ క్యాండీల్లో రోడమైన్‌-బి అనే కెమికల్‌ను గుర్తించారు. కృత్రిమ రంగుల కోసం దీన్ని పీచు మిఠాయిల్లో వినియోగించినట్లు తేలింది.

ఈ నేప‌థ్యంలో పీచు మిఠాయి దుకాణ దారుల‌ను ఇప్ప‌టికే రెండు విడుత‌లు హెచ్చ‌రించిన ప్ర‌భుత్వం అప్ప‌టికీ వారిలో మార్పు రాలేద‌న్న కార‌ణంగా ఏకంగా పీచు మిఠాయి విక్ర‌యం.. తిన‌డంపై కూడా నిషేధం విధిస్తూ.. సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుంది. కాగా, పీచు మిఠాయిపై నిషేధం విధించిన తొలి రాష్ట్రంగా త‌మిళ‌నాడు నిలిచింది. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు అమ‌ల‌వుతుందో చూడాలి.

ఏంటీ రోడ‌మైన్ బి?

రోడమైన్‌-బిని సాధార‌ణ ప‌రిభాష‌లో ‘ఇండస్ట్రియల్‌ డై’గా పిలుస్తారు. దీనిని బ‌ట్ట‌ల‌కు రంగులు అద్దే ప‌నిలోనూ, పేపర్‌ ప్రింటింగ్‌లోను వినియోగిస్తారు. అయితే.. దీనిని ఆహారంగా మాత్రం నిషేధించారు. ఎందుకంటే ఇది క్యాన్స‌ర్ కారక‌మ‌ని ముందుగానే గుర్తించారు. అంతేకాదు, ఇది ఎక్కువ మొత్తంలో మన శరీరంలోకి వెళ్తే.. కిడ్నీ, లివర్‌ పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. అల్సర్ వంటి ప్ర‌మాద‌క‌ర వ్యాధుల‌ను కూడా వ్యాపింప‌జేస్తుంది. క్యాన్సర్‌కు దారితీస్తుంది.