బెంగళూరు ట్రాఫిక్ జాంలో వధువు.. కట్ చేస్తే..

కొన్ని ఘటనలు అనూహ్యంగా ఉంటాయి. సోషల్ మీడియా పుణ్యమా అని పలు వైరల్ వీడియోలు క్షణాల్లో ప్రపంచాన్ని చుట్టేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే.. బెంగళూరు ట్రాఫిక్ జాంలో ఇరుక్కున్న పెళ్లి కుమార్తె.. అనుకున్న ముహుర్తానికి కల్యాణ మండపానికి చేరుకోవటానికి ఆమె తీసుకున్న నిర్ణయం చిట్టి వీడియోలో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో పెళ్లి కుమార్తె తెలివికి.. స్మార్ట్ నెస్ కు అభినందనలు వెల్లువెత్తుతుంటే.. బెంగళూరు ట్రాఫిక్ జాం ఎంత తీవ్రంగా ఉంటుందన్న విషయం మరోసారి చర్చకు రావటమే కాదు.. ఈ ఉద్యాన నగరి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా మారింది.

మరికాసేపట్లో పెళ్లి చేసుకునేందుకు అందంగా ముస్తాబైన పెళ్లి కుమార్తె బెంగళూరు ట్రాఫిక్ జాంలో ఇరుక్కుపోయింది. ఆమె ప్రయాణిస్తున్న కారులో వెళితే.. కచ్ఛితంగా ఆమె పెళ్లి ముహుర్తానికి కల్యాణ మండపానికి చేరుకునే అవకాశం లేదు. దీంతో.. ఏం చేయాలన్న ఆందోళనతో ఇంట్లోని వారు ఉంటే.. మరేం ఫర్లేదంటూ దగ్గర్లోని మెట్రో రైల్ స్టేషన్ కు వెళ్లింది. పెళ్లి కుమార్తెగా ముస్తాబై.. రాణి మాదిరి ఆమె నడుస్తుంటే.. అసలేం జరిగిందో అర్థం కాక పలువురు ఆశ్చర్యానికి గురయ్యారు.

పెళ్లి ముహుర్తం ముంచుకొస్తున్న వేళ.. సమయానికి మండపానికి చేరుకోవటానికి మెట్రోను ఆశ్రయించారన్న విషయం తెలిసినంత ఆమెను అభినందించటమే కాదు.. స్మార్ట్ గా ఆలోచిస్తున్నావంటూ అభినందనలు తెలియజేశారు. మరికొందరు ఆమెతో ఫోటోలు దిగారు.

మొత్తంగా ఆమె ఐడియా ఫలించి.. ముహుర్తానికి ముందుగానే పెళ్లి మండపానికి చేరుకుంది. ఈ వైరల్ వీడియోలో మెట్రో ఎంట్రీ గేటును దాటి రైలు ఎక్కిన ద్రశ్యాలతో పాటు.. ఆమె ప్రయాణిస్తున్న వైనం కనిపిస్తుంది. ‘ఆమె ప్రాక్టికల్ పర్సన్. విష్ హర్ గ్రేట్ ఫ్యూచర్’ అని ఒకరు.. ‘స్మార్ట్ థింకర్’ అని మరొకరు ఇలా పాజిటివ్ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.