మొత్తం గంభీరే చేశాడు..

నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విరాట్ కోహ్లి, గౌతమ్ గంభీర్‌ల గొడవ గురించే చర్చ. లక్నో-బెంగళూరు మ్యాచ్ సందర్భంగా కోహ్లి క్యాచ్‌లు పట్టినపుడు.. వికెట్లు పడ్డపుడు స్పందించిన తీరు.. మ్యాచ్ అయ్యాక కోహ్లి, గంభీర్ మధ్య జరిగిన వాగ్వాదం.. లక్నో ఆటగాడు నవీనుల్ హక్‌తో కోహ్లి గొడవ.. ఇవన్నీ పెద్ద చర్చకే దారి తీశాయి. ఈ మొత్తం వ్యవహారంలో కోహ్లీనే ఎక్కువ నిందకు గురయ్యాడు. మ్యాచ్ రిఫరీ సైతం అతడికి వంద శాతం మ్యాచ్ ఫీజును జరిమానాగా విధించాడు. గంభీర్ సైతం అదే స్థాయిలో శిక్షను ఎదుర్కొన్నాడు. నవీనుల్‌కు సైతం జరిమానా తప్పలేదు.

ఐతే ఈ వివాదం వెనుక నేపథ్యాన్ని పరిశీలిస్తే.. తప్పంతా గంభీర్‌దే అని అర్థం అవుతుంది. గంభీర్‌ ఆటగాడిగా ఉన్న రోజుల్లోనే అతడికి కోహ్లీతో గొడవ జరిగింది. చాలా ఏళ్ల కిందట వాళ్లిద్దరూ ఒక మ్యాచ్‌లో తీవ్ర స్థాయిలో వాదోపవాదాలకు దిగారు. అప్పట్నుంచి ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది.

ఐతే ప్రస్తుతం లక్నో జట్టుకు మెంటార్‌గా ఉన్న గంభీర్.. గత నెల బెంగళూరుతో చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా అతి చేశాడు. ఇప్పుడు పెద్దగా మారిన వివాదానికి బీజం పడింది అక్కడే. చాలా ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో గెలవగా.. మ్యాచ్ అయ్యాక స్టేడియంలో బెంగళూరు అభిమానుల వైపు చూస్తూ నోటి మీద వేలు పెట్టి నోర్మూసుకోండి అన్నట్లు సంజ్ఞ చేశాడు గంభీర్. తమ జట్టుకు ఎంతో మద్దతుగా నిలిచే అభిమానులతో ఇలా వ్యవహరించడం కోహ్లికి కోపం తెప్పించింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే లక్నో సొంతగడ్డలో సోమవారం మ్యాచ్ జరుగుతుండగా.. క్యాచ్ పట్టినపుడు గంభీర్ లాగా నేను చేయను అని సిగ్నల్ ఇచ్చి.. ప్రేక్షకులకు ముద్దులు ఇచ్చాడు. ఇందులో పెద్ద తప్పేమీ కనిపించదు. కాకపోతే కోహ్లి వికెట్లు పడ్డపుడు, మ్యాచ్ గెలిచాక కొంచెం శ్రుతి మించి సంబరాలు చేసుకున్న మాట వాస్తవం.

ఐతే మ్యాచ్ అయ్యాక కోహ్లి, గంభీర్ ఒకరితో ఒకరు చేతులు కలపడానికి ఇష్టపడలేదు. మరోవైపు లక్నో ఆటగాడు మేయర్స్ కోహ్లితో మాట్లాడుతుంటే.. గంభీర్ వచ్చి తనతో మాటలేంటి అన్నట్లుగా అతణ్ని లాక్కెళ్లిపోయాడు. గొడవ పెద్దదైంది ఇక్కడే. కోహ్లికి కోపం వచ్చి గంభీర్‌తో వాగ్వాదానికి దిగాడు. బెంగళూరులో మ్యాచ్ సందర్భంగా, ఇప్పుడు కోహ్లిని కవ్వించిందే గంభీర్. విరాట్‌ను ఎవరైనా రెచ్చగొడితే అతను ఊరుకోడు. ఒకటికి రెండింతలు ఇచ్చేస్తాడు. సోమవారం రాత్రి కూడా అదే జరిగింది. ఈ వివాదాన్ని మొదట్నుంచి గమనిస్తే.. మొత్తం గంభీరే చేశాడు అనే విషయం అర్థమైపోతుంది.