ఐపీఎల్: థ్రిల్లర్ కు మించిన చివరి బంతి విజయం

ఐపీఎల్ తాజా సీజన్ లో సంచలన ఫలితాలు నమోదు అవుతున్నాయి. మొన్నటికి మొన్న కోల్ కత్తా నైట్ రైడర్స్ – గుజరాత్ టైటాన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో చివరి ఓవర్లో కోల్ కత్తా నైట్ రైడర్స్ బ్యాట్స్ మెన్ రింకు సింగ్ ఆడిన అద్భుత ఇన్నింగ్స్ కు క్రికెట్ అభిమానులు ఫిదా అయ్యారు. చివరి ఓవర్లో జట్టు గెలుపునకు అవసరమైన 29 పరుగుల చేధన అసాధ్యమని అందరూ భావించిన వేళ.. అనూహ్యంగా చివరి ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు బాదేసి జట్టుకు సంచలన విజయాన్ని కట్టబెట్టటం తెలిసిందే. ఈ మ్యచ్ ను లైవ్ లో చూస్తున్న వారికి కలిగిన కిక్కును ఎంత చెప్పినా తక్కువే.

తాజాగా ఇప్పుడు అలాంటి కిక్కు ఇచ్చే సీన్ ఒకటి ముంబయి ఇండియన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరిగిన తాజా మ్యాచ్ లో చోటు చేసుకుంది. హ్యాట్రిక్ ఓటమి ఖాయమన్న భావనతో ఉన్న వారికి ఊరటనిస్తూ రోహిత్ సేన సాధించిన అద్భుత విజయానికి ముంబయి ఇండియన్స్ జట్టు అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. మ్యాచ్ చివరి బంతి వరకు ఫలితం ఎలా ఉంటుందా? అన్న టెన్షన్ పుట్టించి.. నిలువుకాళ్ల మీద నిలుచుకోబెట్టిన ఈ ఫలితం ముంబయి ఇండియన్స్ కు అనుకూలంగా.. ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రతికూలంగా రావటం తెలిసిందే.

మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్ లో ముంబయి ఇండియన్స జట్టు మేజిక్ ఆటను ప్రదర్శించింది. జట్టు విజయానికి ముంబయి బ్యాట్స్ మెన్లు చివరి ఓవర్లో 5 పరుగులే చేయాల్సిన వేళలో.. నోకియా అద్భుత బౌలింగ్ తో ఢిల్లీ జట్టును గెలిపించే ప్రయత్నం చేశాడు. అయితే.. ముంబయి బ్యాట్స్ మెన్ల వీరోచిత ఆటతో విజయం వారిని వరించేలా చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ జట్టు 19.4 ఓవర్లకు 172 పరుగులు చేసి అలౌట్ అయ్యింది.

173 పరుగుల లక్ష్య చేధనకు ముంబయి బ్యాట్స్ మెన్లు బరిలోకి దిగారు. గడిచిన 24 ఇన్నింగ్స్ లో తన ప్రతాపాన్ని చూపించే విషయంలో వరుస వైఫల్యాల్ని ఎదుర్కొంటున్న రోహిత్ శర్మ తాజా మ్యాచ్ లో పాత రోహిత్ ను మళ్లీ తీసుకొచ్చేశాడు. అతడి అద్భుత ఆటకు ప్రత్యర్థి జట్లు సైతం మురిసిపోయేలా చేసింది. అన్నింటికి మించి గంటకు 147 కిలోమీటర్ల వేగంతో నిప్పులు చెరిగే బంతిని నోకియా వేస్తే.. దాన్ని మిడ్ వికెట్ లో రోహిత్ సిక్సర్ గా మలిచిన వైనాన్ని చూసేందుకు రెండు కళ్లు చాలవన్నట్లుగా ఉంది. ఇటీవల కాలంలో వరుసగా విఫలమవుతున్న రోహిత్ ఈ మ్యాచ్ లో 65 పరుగులు చేశాడు. మ్యాచ్ మొత్తం ఒక ఎత్తు.. చివరి ఓవర్ మరో ఎత్తుగా చెప్పాలి.

చివరి ఓవర్లో విజయానికి 5 పరుగులు అవసరం కాగా.. నోకియా బౌలింగ్ కు దిగాడు. తన అద్భుతమైన బౌలింగ్ తో బ్యాట్స్ మెన్లు షాట్లు కొట్టే అవకాశం ఇవ్వలేదు. దీంతో.. చివర బంతికి రెండుపరుగులు తీసే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఇలాంటి వేళ.. గ్రీన్ భారీ షాట్ ఆడలేకపోయినా.. లాంగాఫ్ వైపు బంతిని పంపి వేగంగా రెండు పరుగులు తీశారు. నిజానికి అతను కొట్టిన షాట్ కు రెండు పరుగులు అసాధ్యం.ఒక పరుగే సాధ్యం. అయితే.. వాయువేగంతో పరుగులు తీసిన బ్యాట్స్ మెన్ల ప్రయత్నానికి.. బంతిని అందుకున్న వార్నర్ త్రో సరిగా వేయకపోవటంతో రనౌట్ ను త్రుటిలో తప్పించుకున్నారు. దీంతో.. ముంబయి జట్టు అద్భుత విజయాన్ని సొంతం చేసుకోగా.. ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఏమైనా.. చివరి బంతి వరకు ఫలితం ఏమవతుందో అన్న టెన్షన్ పుట్టించిన ఈ మ్యాచ్ ను క్రికెట్ ప్రేమికులు అంత త్వరగా మర్చిపోరని మాత్రం చెప్పక తప్పదు.