పెళ్లి పత్రికల్ని పంచేందుకు హెలికాఫ్టర్ వాడిన హైదరాబాదీ

చాలా మందికి డబ్బులు ఉంటాయి. కానీ.. వాటిని వినియోగించే విషయంలో ఒక్కొక్కరు ఒక్కోలా వ్యవహరిస్తుంటారు. అందరు నడిచిన బాటలో నడవకుండా.. రోటీన్ కు భిన్నంగా వ్యవహరించేటోళ్లు కొందరు ఉంటారు. ఒక హైదరాబాదీ చేసిన క్రేజీ పనితో సెలబ్రిటీ స్టేటస్ ను సొంతం చేసుకోవటం ఆసక్తికరంగా మారింది.

హైదరాబాద్లోని ఖైరతాబాద్ కు చెందిన మధు యాదవ్ కాస్తంత సౌండ్ పార్టీ. అతడు దూద్ వాలా డైరీని నిర్వహిస్తుంటాడు. అతడి సోదరుడి పెళ్లి ఫిక్సు అయ్యింది. ఈ నెల 9న జరిగే పెళ్లికి జరుగుతున్న పనులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. చేయాల్సిన పనులు చాలానే పెండింగ్ లో ఉన్నాయి. ఇలాంటి వేళలోనే పెద్ద ఇబ్బందిగా మారింది పెళ్లి పత్రికల పంపిణీ కార్యక్రమం. తమ బంధువులు పలువురు ముంబయిలో ఉండటం.. అంత దూరాన వెళ్లి ఇవ్వటానికి చాలా టైం తీసుకునే వీలు ఉండటంతో.. మిగిలిన వారి మాదిరి వాట్సాప్ లో పెళ్లి పత్రికల్ని పంపకుండా కాస్త భిన్నంగా ఆలోచించాడు.

హెలికాఫ్టర్ ను అద్డెకు తీసుకొని.. హైదరాబాద్ నుంచి ముంబయికి వెళ్లి వచ్చాడు. ముంబయికి చేరుకొని బంధువుల ఇళ్లకు వెళ్లి.. స్వయంగా పెళ్లి కార్డులు ఇచ్చి తిరిగి వచ్చాడు. దీనికి సంబంధించిన వివరాలుబయటకు రావటంతో సోదరుడు పెళ్లి కార్డుల్ని పంచటం కోసం ఏకంగా హెలికాప్టర్ నే బుక్ చేశాడా? అని ఆశ్చర్యపోతున్నారు. దీంతో.. ఇతగాడుస్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. పనిలో పనిగా తాను చేసిన పనిని సోషల్ మీడియాలో పోస్టు చేయటంతో.. అది కాస్తా వైరల్ గా మారింది. ఇప్పుడు చెప్పండి.. డబ్బులు ఉంటేనే సరిపోతుందా? దాన్ని కళాత్మకంగా ఖర్చు పెట్టే ఆర్ట్ కూడా ఉండాలనిపించట్లేదు?