సెక్యూరిటీ గార్డ్ లవ్ స్టోరీ – పాక్ టు ఇండియా వయా నేపాల్

విదేశీ నిబంధనలు తెలియని ఓ సామాన్యుడు తన లవర్ కోసం చేసిన సాహసంతో జైలు పాలయ్యాడు. యూపీకి చెందిన ఒక వ్యక్తి ఆన్ లైన్ గేమింగ్ యాప్ ద్వారా పరిచయమైన పాకిస్థానీ యువతిని పెళ్లాడి.. బెంగళూరులో రహస్యంగా కాపురం పెట్టటం సంచనలంగా మారింది. రీల్ స్టోరీకి ఏ మాత్రం తీసిపోని రియల్ స్టోరీలోకి వెళితే..

యూపీకి చెందిన ములాయం సింగ్ యాదవ్ అనే పాతికేళ్ల కుర్రాడు బెంగళూరులో సెక్యురిటీ గార్డుగా ఉద్యోగం చేస్తుంటాడు. ఆన్ లైన్ గేమింగ్ యాప్ ద్వారా పాకిస్థాన్ కు చెందిన పంతొమ్మిదేళ్ల ఇక్రా జీవని అనే అమ్మాయితో పరిచయమైంది. వారి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారింది. ఆమెను పెళ్లాడేందుకు అతను నేపాల్ వెళ్లగా.. ఆమెకూడా పాక్ నుంచి నేపాల్ వచ్చేసి.. వారిద్దరూ పెళ్లి చేసుకున్నారు.

అనంతరం కష్టసాధ్యమైన ఇండో నేపాల్ సరిహద్దు ద్వారా తప్పుడు సమాచారంతో దేశానికి తీసుకొచ్చాడు. తొలుత యూపీకి వెళ్లగా.. అక్కడ అనుకూలంగా లేకపోవటంతో బెంగళూరు వచ్చేశాడు. .అక్కడే వీరిద్దరూ కాపురం చేస్తున్నారు. సెక్యురిటీ గార్డుగా ఉద్యోగం చేస్తున్న ములాయం.. అతడి భార్యకు సంబంధించిన సమాచారాన్ని సేకరించిన అధికారులు తాజాగా వారింటికి వచ్చి వారిద్దరిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ సందర్భంగా తన భార్య భారతీయురాలు అని తెలిపేలా తప్పుడు మార్గంలో ఆధార్ తీసుకోవటమే కాదు.. పాస్ పోర్టుకు అప్లై చేశాడు. అయితే.. వీరిద్దరి మధ్య రిలేషన్ ను నిఘా అధికారులు గుర్తించారు. రహస్యంగా దర్యాప్తు చేయగా.. ఆమెకు సంబంధించిన పత్రాలన్ని నకిలీవిగా గుర్తించారు. అదే సమయంలో పాక్ లోని తన పుట్టింటి వారితో ఇక్రా మాట్లాడిన ఫోన్ కాల్ ను రికార్డు చేసిన వారు.. అధికారుల్ని క్రాస్ చెక్ చేయటంతో ఈ విషయాలన్ని బయటకు వచ్చాయి. ఆ వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

ములాయంను జైలుకు తరలించగా.. ఇక్రాను మాత్రం విదేశీ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీసు అధికారులకు అప్పగించి.. ఆ తర్వాత స్టేట్ హోంకు తరలించారు. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా అక్రమంగా నివాసం ఉంటున్న నేపథ్యంలో చట్ట ప్రకారం చర్యలకు సిద్ధమవుతున్నారు. విదేశీ మహిళను ప్రేమించటం తప్పేం కాదు. కానీ.. చేసే పని చట్ట బద్ధంగా చేస్తే తలనొప్పులు ఉండవు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే ఇలాంటి తిప్పలు తప్పవంతే.