ట్విట్టర్ సీఈవోగా ఒక తెలివి తక్కువ వ్యక్తి కావలెను

Elon Musk
Elon Musk

పంతం పట్టి ట్విట్టర్‌ను చేజిక్కించుకున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఆ సంస్థ సీఈవో అయిన దగ్గర్నుంచి సంచలన నిర్ణయాలతో వార్తల్లో నిలుస్తున్నాడు. అంతకుముందున్న ప్రధాన కార్యవర్గంతో పాటు వేల సంఖ్యలో పాత ఉద్యోగులను సాగనంపడం.. పని వేళల్ని పెంచడం లాంటి నిర్ణయాలతో మస్క్ విమర్శలు ఎదుర్కొన్నాడు. అలాగే ట్విట్టర్లోనూ పలు మార్పులకు అతను శ్రీకారం చుట్టాడు.

మస్క్ నిర్ణయాలతో పాటు ట్విట్టర్ వేదికగా మస్క్ చేసే వ్యాఖ్యానాలు తిక్క తిక్కగా అనిపిస్తూ ఆయనకు విమర్శలు తెచ్చిపెడుతున్నాయి. తన మీద జనాలు చూపిస్తున్న వ్యతిరేకత, ట్రోలింగ్ చూసి మస్క్ రెండు రోజుల కిందట ఒక ఆసక్తికర పోల్ పెట్టాడు. తాను ట్విట్టర్ సీఈవోగా తప్పుకోవాలా వద్దా అంటూ పోల్ పెట్టి.. ఈ పోల్ ఫలితాలకు తాను కట్టుబడి నిర్ణయం తీసుకుంటానని ప్రకటించాడు.

కట్ చేస్తే ఈ పోల్‌లో మస్క్ తప్పుకోవాలని 57.5 మంది అభిప్రాయపడ్డారు. 42.5 శాతం మంది మాత్రమే ఆయన కొనసాగాలని అన్నారు. ఈ పోల్ తర్వాత మస్క్ రెండు రోజులు సైలెంటుగా ఉండడం చర్చనీయాంశం అయింది. పోల్ ఫలితాలతో షాక్ తిని ఆ టాపిక్‌ను పక్కన పెట్టేశాడని అనుకున్నారు.

కానీ తాజాగా మస్క్ ఈ విషయంపై స్పందించాడు. జనాలు కోరుకున్నట్లే తాను ట్విట్టర్ సీఈవోగా తప్పుకుంటానని ప్రకటించాడు. కానీ దానికో మెలిక పెట్టాడు. తన కంటే తెలివి తక్కువ వ్యక్తి దొరగ్గానే సీఈవో పదవిని ఆ వ్యక్తికి అప్పగించేసిన.. తాను సాఫ్ట్ వేర్, సర్వర్ టీంలను చూసుకుంటానని ప్రకటించాడు. తన కంటే తెలివి తక్కువ వ్యక్తి అనడంలో వ్యంగ్యం ధ్వనిస్తోంది. దీని ఉద్దేశమేంటో మస్క్‌కే తెలియాలి. మరి నిజంగానే మరో వ్యక్తిని తీసుకొచ్చి మస్క్ తన స్థానంలో సీఈవోగా చేస్తాడేమో చూడాలి.