23 ఐపీఎల్.. ఇదే పెద్ద ట్విస్ట్

ప్రపంచకప్‌లో టీమ్ఇండియా సెమీఫైనల్లో నిష్క్రమించగానే.. జట్టుపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీల్లో భారత జట్టు వైఫల్యానికి ఐపీఎలే కారణమంటూ ఆ లీగ్‌ను నిందించడం మొదలుపెట్టారు. కానీ ఇలా ఐపీఎల్‌ను తిట్టేవాళ్లంతా కూడా ఆ టోర్నీ వస్తే దానికి అతుక్కుపోవాల్సిందే. దానికి ఉన్న ఆకర్షణ అలాంటిది. ఈ విమర్శలను బీసీసీఐ కానీ, ఐపీఎల్ ఫ్రాంఛైజీలు కానీ, ఆటగాళ్లు కానీ పట్టించుకోవడం జరగదు. ఇంకా కొత్త సీజన్‌కు ఐదు నెలల సమయం ఉండగా.. ఈలోపే హడావుడి మొదలైపోయింది.

ఈసారి ఐపీఎల్ మినీ వేలాన్ని కొంచెం ముందుగా డిసెంబరులోనే నిర్వహించబోతున్నారు. ఆ ప్రక్రియకు ముందు ఫ్రాంచైజీలు తమకు అవసరం లేని ఆటగాళ్లను విడిచిపెట్టడం.. వేరే ఫ్రాంఛైజీల నుంచి తమకు అవసరమైన ఆటగాళ్లను తీసుకోవడం జరుగుతుంటుంది. ఈ ప్రక్రియ కొన్ని రోజుల పాటు జరిగి మంగళవారంతో ముగిసింది.

గత ఐపీఎల్ సీజన్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో జరిగిన గొడవ గురించి తెలిసిందే. సీజన్ ఆరంభానికి ముందు రవీంద్ర జడేజాను కెప్టెన్‌ను చేయగా.. అతడి నాయకత్వంలో జట్టు విఫలమవడంతో మధ్యలో అతణ్ని కెప్టెన్‌గా తప్పించి తిరిగి ధోనీకే పగ్గాలు అందించడం తెలిసిందే. దీనిపై జడేజా తీవ్ర అసంతృప్తితో రగిలిపోయాడు. అప్పట్నుంచి మిగతా మ్యాచుల్లో ఆడలేదు. ఆ తర్వాత జడేజా చెన్నై ఫ్రాంఛైజీకి టాటా చెప్పేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ దిశగా అతను పరోక్షంగా సంకేతాలు ఇచ్చాడు.

ఆటగాళ్ల బదలాయింపు ప్రక్రియలో భాగంగా జడేజాను చెన్నై విడిచిపెట్టడం లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ అందరికీ షాకిస్తూ చెన్నై అతణ్ని అట్టిపెట్టుకుంది. జడేజా కూడా ట్విట్టర్లో ధోనికి సలాం కొడుతున్నట్లుగా ఉన్న ఫొటో పెట్టి ‘రీస్టార్డ్’ అనే మెసేజ్ పెట్టాడు. దీన్ని బట్టి మధ్యలో ధోని జోక్యం చేసుకుని జడేజాకు, ఫ్రాంఛైజీకి సయోధ్య కుదర్చినట్లు అర్థమవుతోంది.

రాబోయే సీజన్లో జట్టున నడిపించాక ధోని ఐపీఎల్ నుంచి మొత్తంగా రిటైర్మెంట్ తీసుకుంటాడని అంటున్నారు. అంతా బాగా జరిగితే మళ్లీ జడేజాకే చెన్నై పగ్గాలు దక్కే అవకాశాలున్నాయి. ఇదిలా ఉండగా.. తన జిడ్డు బ్యాటింగ్‌తో ఐపీఎల్‌లోనే కాక అంతర్జాతీయ క్రికెట్లోనూ విమర్శలు ఎదుర్కొంటున్న కేన్ విలియమ్సన్‌ను ఎట్టకేలకు సన్‌రైజర్స్ హైదరాబాద్ విడిచిపెట్టింది. వార్నర్ దూరమయ్యాక గత సీజన్లో అతనే హైదరాబాద్‌ను నడిపించాడు. కేన్ ఫామ్‌ను బట్టి చూస్తే ఇంకే ఫ్రాంఛైజీ కూడా అతణ్ని తీసుకునే అవకాశం లేనట్లే.