ధోని చేతికి టీమ్ ఇండియా?

ఇండియన్ క్రికెట్ టీంకు సంబంధించి పెను మార్పులు అవసరం అన్న చర్చ గత కొన్ని రోజులుగా జోరుగా నడుస్తోంది. ప్రపంచకప్ మీద బోలెడు ఆశలతో భారత జట్టు టోర్నీకి వెళ్లడం.. చివరికి ఏదో ఒక దశలో విఫలమై నిష్క్రమించడం మనకు అలవాటే. దశాబ్ద కాలంగా ఇదే జరుగుతోంది. కానీ ఈసారి ప్రపంచకప్‌లో ఎదురైన పరాభవం మాత్రం చాలా పెద్దది. భారత జట్టు అతి కష్టం మీద దాదాపు 170 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్‌కు నిర్దేశిస్తే.. ఆ జట్టు ఒక్కటంటే ఒక్క వికెట్ కోల్పోకుండా, ఇంకో 4 ఓవర్లు మిగిలుండగానే ఛేదించేసింది. మరీ ఇంత ఘోరమైన ఓటమితో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించడంతో భారత జట్టుపై విమర్శలు మామూలుగా లేవు.

మన క్రికెట్ ప్రమాణాల గురించి అందరూ ప్రశ్నించుకునేలా చేసింది ఈ ఓటమి. ఇప్పుడున్నట్లే జట్టు ఉంటే, ఇదే ఆట ఆడితే భవిష్యత్తులోనూ ప్రపంచకప్‌ సాధించే అవకాశం లేదని అందరూ ఒక నిర్ణయానికి వచ్చేశారు.
జట్టులో ఆటగాళ్లను మార్చడమే కాదు.. ఆటతీరును కూడా మారిస్తే తప్ప భారత క్రికెట్ బాగుపడదనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి.

ప్రపంచకప్ గెలిచిన ఇంగ్లాండ్‌ స్ఫూర్తిగా అడుగులు వేయాల్సిన అవసరాన్ని అందరూ గుర్తు చేస్తున్నారు. డిఫెన్సివ్ అప్రోచ్ పక్కన పెట్టి అగ్రెసివ్‌గా ఆడటం.. ఆ తరహా దృక్పథం ఉన్న ఆటగాళ్లతో వన్డే, టీ20 జట్లను తయారు చేసుకోవడం అవసరం అంటున్నారు. ఈ అప్రోచ్ రాహుల్ ద్రవిడ్‌తో సాధ్యం కాదని, పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వేరే కోచ్ అవసరమని బీసీసీఐ కూడా తీవ్రంగానే ఆలోచిస్తోందట. అందుకే మాజీ ఆటగాడు మహేంద్ర సింగ్ ధోనికి వన్డే, టీ20ల జట్ల బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు సమాచారం.

ధోని 2023 ఐపీఎల్ తర్వాత పూర్తిగా ఆటకు గుడ్ బై చెప్పబోతున్నాడు. ఆ తర్వాత ధోనిని భారత జట్టులో యువ ఆటగాళ్లను తీర్చిదిద్దే బాధ్యత అప్పగిస్తారట. కొన్నాళ్లు ఈ ప్రక్రియ జరిగాక ద్రవిడ్‌ను టెస్టుల వరకు కోచ్‌గా పరిమితం చేసి.. వన్డేలు, టీ20 జట్ల బాధ్యతలను పూర్తిగా ధోనికి అప్పగించబోతున్నట్లు భారత క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.