రూ.2వేల నోటుపై ఆర్బీఐ చెప్పిన నిజం!

సరిగ్గా ఆరేళ్ల క్రితం.. రాత్రి వేళలో టీవీ స్క్రీన్ల మీద లైవ్ లో ప్రత్యక్షమైన ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లను రద్దు చేసిన వైనాన్ని ప్రకటించి దేశ ప్రజలతో పాటు.. పలు దేశాలను సైతం ఆశ్చర్యానికి గురి చేశారు. పెద్ద నోట్ల రద్దు అంటూ అప్పట్లో చెలామణీలో ఉన్న వెయ్యి రూపాయిలు.. రూ.500 నోట్లు రాత్రికి రాత్రి రద్దు అయినట్లుగా చెప్పటంలో ఒక్కసారి అవాక్కు అయిన పరిస్థితి. అనంతరం వాటి స్థానే రూ.2వేల నోట్ ను తీసుకొచ్చి.. కొంతకాలానికి రూ.500నోట్లను తేవటం తెలిసిందే.

గడిచిన కొద్దికాలంగా రూ.2వేల నోట్లు పెద్దగా బయట లభించని పరిస్థితి. తాజాగా సమాచార హక్కుచట్టం కింద రూ.2వేల నోటు గురించి వివరాల్ని అడిగిన ఒక కార్యకర్తకు ఆర్బీఐ బదులిచ్చింది. దాని సారాంశం ఏమంటే.. 2019-2020, 2020-2021, 2021-2022లలో ఒక్కటంటే ఒక్క రూ.2దవేల నోటును కూడా ప్రింట్ చేయలేదని స్పష్టం చేసింది. ఎందుకిలా అన్న దానికి కారణాలు స్పష్టంగా వెల్లడించనప్పటికీ.. రూ.2వేల నోటును క్రమంగా వెనక్కి తీసుకుంటారన్న ప్రచారం నిజమన్న విషయం తాజా సమాధానంతో స్పష్టమైందని చెప్పాలి.

2016-17 ఆర్థిక సంవత్సరంలో 3542.9 మిలియన్ రెండు వేల నోట్లను ప్రింట్ చేయగా.. ఆ సంఖ్య 2017-18లో 111.5కు తగ్గిపోయిందని పేర్కొంది. అంతేకాదు 2018-19లో 46.49 మిలియన్ నోట్లుగా ఉన్నట్లుగా పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. 2 వేల నకిలీ నోట్ల సంఖ్య 2016-2020 మధ్య 2277నుంచి 2.44లక్షలకు పెరిగిన వైనం తెలిసిందే. అంటే.. ఒరిజినల్ రూ.2వేల నోట్లు గణనీయంగా తగ్గిపోతే.. అందుకు భిన్నంగా డూప్లికేట్ నోట్లు మాత్రం చెలామణీలోకి వస్తున్న వైనం ఆర్ బీఐ ఇచ్చిన తాజా సమాధానం స్పష్టం చేసిందని చెప్పాలి.