10 మంది పిల్ల‌ల‌ను కంటే.. 13 ల‌క్ష‌లు

జ‌నాభా విష‌యంలో ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా ముందుకు సాగుతోంది. కొన్ని దేశాల జ‌నాభా భారాన్ని త‌గ్గించుకునేందు కు ప‌థ‌కాలు ప్ర‌వేశ పెడుతున్నాయి. ఉదాహ‌ర‌ణ‌కు మ‌న దేశంలో ఒక‌ప్పుడు ఇద్ద‌రు ముద్దు.. ముగ్గురు హ‌ద్దు అనే నినాదం పెద్ద‌గా వినిపించింది. త‌ర్వాత‌.. ఇది కాస్తా.. ఒక్క‌రు ముద్దు-ఇద్ద‌రు హ‌ద్దుగా మారింది. కొన్నాళ్ల‌కు మీరిద్ద‌రు-మీకొక్క‌రు నినాదం కూడా చాలా రాష్ట్రాల్లో ప్ర‌చారంలోకి వ‌చ్చింది. ఇక‌, ఇప్పుడు ఏకంగా జ‌నాభా నియంత్ర‌ణ బిల్లును త్వ‌ర‌లోనే పార్ల‌మెంటులో ప్ర‌వేశ పెట్ట‌నున్నారు.

ఇక‌, పొరుగున ఉన్న‌ చైనాలో నిన్న మొన్న‌టి వ‌ర‌కు అస‌లు పిల్ల‌లే వ‌ద్ద‌ని క‌ఠిన ఆంక్ష‌లు అమ‌లు చేశారు. అయితే.. ఇప్పుడు అక్క‌డ యువ సంత‌తి త‌గ్గిపోవ‌డంతో `పిల్ల‌లను క‌నండి మొర్రో“ అంటూ. ప్ర‌భుత్వ‌మే ప్ర‌చారం చేస్తోంది. అయితే.. దీనికి సంబంధించి పెద్ద‌గా తాయిలాలు ప్ర‌క‌టించ‌క‌పోయినా.. ఉద్యోగినుల‌కు సెల‌వులు ఇస్తున్నారు. ఉచిత రేష‌న్ కూడా పంపిణీ చేస్తున్నారు. ఇక‌, ఇప్పుడు దీనికి మించి అన్న రేంజ్‌లో ర‌ష్యా ప్ర‌భుత్వం సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. భారీ సంఖ్య‌లో పిల్ల‌ల‌ను క‌నే త‌ల్లుల‌కు అవార్డులు, రివార్డులు ఇవ్వ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించింది. అది కూడా  ఒక్కొక్క మాతృమూర్తి 10 మంది పిల్ల‌ల‌ను కంటే సంతోషిస్తామ‌ని పేర్కొంది.

ఇలా ఎందుకంటే..

గత కొంతకాలంగా రష్యాలో జనాభా తగ్గుతోంది. దీంతో ఆందోళన చెందిన అధ్యక్షుడు పుతిన్‌ దేశంలో జనాభాను పెంచుకోవడం కోసం సోవియట్‌ కాలంలో అమల్లో ఉన్న ఓ పురస్కారాన్ని మళ్లీ పునరుద్ధరించారు. కుటుంబాలను విస్తరించే దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు గానూ.. 10, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు నజరానా ప్రకటించారు. ఈ మేరకు ‘మదర్‌ హీరోయిన్‌’ అవార్డును ప్రకటించారు. అంతేకాదు, ఈ మహిళలకు మిలియన్‌ రూబెల్స్‌ (భారత కరెన్సీలో దాదాపు రూ.13 లక్షలకుపైన) నజరానా ఇస్తామని పుతిన్‌ సర్కారు ప్రకటించింది.

ఈ మొత్తాన్ని ఒకేసారి చెల్లించనున్నట్లు తెలిపింది. అయితే, దీనికో మెలిక  పెట్టింది. 10వ బిడ్డ మొదటి పుట్టిన రోజు నాడు ఈ నగదు చెల్లిస్తారట. అప్పటికి మిగతా 9 మంది పిల్లలు జీవించి ఉండాలని షరతు పెట్టారు. ఈ అవార్డుకు సంబంధించి రష్యా మీడియాలో పలు కథనాలు వెలువడినట్లు తెలుస్తోంది.

నిజానికి ఈ అవార్డును 1944లో అప్పటి సోవియట్‌ ప్రీమియర్‌ జోసెఫ్‌ స్టాలిన్ ప్రవేశపెట్టారు. యూఎస్ఎస్ఆర్‌ గౌరవ పురస్కా రంగా పేర్కొంటూ దాదాపు 4లక్షల మంది పౌరులకు ఈ అవార్డును అందజేశారు. ఇప్పుడు రష్యా జనాభా పెంచడం కోసం పుతిన్‌ ఈ అవార్డును మళ్లీ వెలుగులోకి తీసుకురావడం గమనార్హం. కుటుంబం ఎంత పెద్దగా ఉంటే దేశంపై అంత ఎక్కువ గౌరవం ఉంటుందని పుతిన్‌ అభిప్రాయపడుతున్నారట.

గత కొంతకాలంగా రష్యాలో జనాభా తగ్గుతున్నట్లు అనేక నివేదికలు వెల్లడించాయి. కొవిడ్‌ మహమ్మారితో పాటు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కూడా ఇందుకు కారణమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలుపెట్టిన నాటి నుంచి వేలాది మంది క్రెమ్లిన్‌ సైనికులు మరణించినట్లు అంతర్జాతీయ అధ్యయనాలు పేర్కొన్నాయి. ఈ యుద్ధంలో ఇప్పటివరకు దాదాపు 15వేల మంది రష్యా సైనికులు మృతిచెంది ఉంటారని అంచనా. ఏదేమైనప్పటికీ.. ప్రస్తత పరిస్థితుల్లో కేవలం మిలియన్‌ రూబెల్స్‌ కోసం 10 మంది పిల్లల్ని కని పెంచడం సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరి ఈ అవార్డుకు ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి..!