బ్రిటన్ బాటపడుతున్న ఇండియన్లు

విదేశాల్లో చదువుకోవాలని అనుకోవాళ్ళకు మొదటి ఆప్షన్ గా దశాబ్దాలుగా అమెరికా మాత్రమే గుర్తొస్తుంది. అయితే ఈమధ్య కాలంలో అమెరికాకు బదులు బ్రిటన్, ఆస్ట్రేలియా, కెనడాలు కూడా ఛాయిస్ గా మారుతోంది. ఎందుకంటే ఈ దేశాల్లో ఇండియన్లక మంచి అవకాశాలను కల్పిస్తున్నాయి కాబట్టే. ఐదేళ్ళ క్రితంవరకు బ్రిటన్లో చదవటానికి వెళ్ళిన మొత్తం విద్యార్ధులను లెక్కేస్తే సుమారు 20 వేలమంది ఉండేవారు. కానీ ఈ సంఖ్య ఇపుడు మాత్రం విపరీతంగా పెరిగిపోతోంది.
 
2021లో మనదేశం నుండి బ్రిటన్లో చదువుకునేందుకు 1 లక్షమంది వీసాలు పొందారు. అంటే లక్షమంది బ్రిటన్ వెళ్ళి చదువుకుంటున్నట్లే అర్ధం. వీసాలు తీసుకున్న తర్వాత వెళ్ళకుండా ఉండరు కదా. అంటే దశాబ్దాల పాటు బ్రిటన్ వెళ్ళిన ఇండియన్ల సంఖ్య 20 వేలుంటే ఒక్క 2021లో మాత్రమే లక్షమంది వెళ్ళారంటేనే అక్కడి పరిస్ధితులు ఎంత ప్రోత్సాహకరంగా ఉంటున్నాయో అర్ధం చేసుకోవచ్చు. 2022 మరింత రికార్డు సృష్టించే అవకాశముంది.

ఎలాగంటే ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటికే లక్షమందికి పైగా ఉన్నతచదువుల కోసం వీసాలు తీసుకున్నారట. అంటే మిగిలిన నాలుగు మాసాల్లో సగంమంది వీసాలు తీసుకున్నా దాదాపు లక్షన్నరమంది బ్రిటన్ వెళ్ళటానికి రెడీ అవుతున్నారనే అనుకోవాలి. మామూలుగా అయితే బ్రిటన్లో చదువుకునే విదేశీ విద్యార్ధుల్లో చైనాదే అగ్రస్ధానం ఉండేది. దశాబ్దాలుగా బ్రిటన్లో డ్రాగన్ దేశపు విద్యార్ధులకే హవాగా ఉండేది. దాన్ని ఇపుడు మనదేశం దాటేస్తోంది. యూకే జారీచేస్తున్న స్కిల్డ్ వర్క్ వీసాల్లో 44 శాతం మనదేశం వాళ్ళకే దక్కాయట.

ఒక్కసారిగి మనదేశం నుండి బ్రిటన్ కు ఎందుకింతమంది వెళుతున్నారు ? ఎందుకంటే రెండుదేశాల మధ్య చదువులు, ఉద్యోగాల విషయంలో చేసుకున్న ఒప్పందాలే కారణం. బ్రిటన్లో చదువుకున్న విద్యార్ధులు ఇండియాలో ఉద్యోగాలు చేయటానికి ఈమధ్యనే కేంద్రప్రభుత్వం అంగీకరించింది. ఒకపుడు చదువుకోసం బ్రిటన్ వెళితే అక్కడే ఉద్యోగాలు చేసుకుని సెటిలైపోయేవారు. కానీ ఈమధ్య జరిగిన ఒప్పందాల కారణంగా అక్కడ చదువుకున్నా ఇక్కడా ఉద్యోగాలు చేస్తున్నారు. అలాగే ఇండియాలో చదువుకున్న వారు బ్రిటన్లో కూడా ఉద్యోగాలు చేయచ్చని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. ఇలాంటి అనేక కారణాల వల్ల బ్రిటన్లో చదువుకోవటానికి ఇండియన్లు క్యూ కడుతున్నారు.