ఏపీలో మరో దారుణం.. బాలికపై ప్రిన్సిపాల్ అత్యాచారం

ఏపీలో మహిళలు, బాలికలపై దురాఘతాలు కాస్త తగ్గుముఖం పట్టయానుకుంటున్న సమయంలో.. కాకినాడ జిల్లాలో మరో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై ప్రైవేటు హాస్టల్ ప్రిన్సిపాల్ విజయకుమార్‌ అత్యాచారానికి ఒడిగట్టిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్ని నెలలుగా బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు తేలింది. కరోనా నివారణ మందు పేరిట మత్తు మందు ఇచ్చి దారుణానికి తెగబడినట్లు బాలిక తెలిపింది.

నిందితుడి అఘాయిత్యంతో బాలిక గర్భం దాల్చిందని, ప్రస్తుతం ఆమెకు గర్భస్రావమైనట్లు వైద్యులు నిర్ధరించారు. బాధితురాలిని ఓ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు.. పోలీసులు పోక్సో చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుడు విజయకుమార్ ప‌ట్టుబ‌డ్డాడు.

మ‌హిళా క‌మిష‌న్ సీరియ‌స్‌

విద్యార్ధినిపై ప్రిన్సిపాల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ భగ్గుమంది. ఈ విషయం వెలుగులోకి రాగానే కాకినాడ ఎస్పీతో మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. కాకినాడలోని కొండయ్యపాలెం హెల్పింగ్ హ్యాండ్స్ వసతిగృహంలో 15ఏళ్ల విద్యార్ధిని ఉంటూ సమీప పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. కరోనా మందుల పేరిట విద్యార్ధినితో నిద్రమాత్రలు మింగించి ప్రిన్సిపాల్ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన సంగతి వెలుగులోకి రాగానే, రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది.  

కాకినాడ ఏరియాను మహిళా కమిషన్ తరఫున పర్యవేక్షించే కమిషన్ సభ్యులు కర్రి జయశ్రీ ని స్థానిక అధికారులను అప్రమత్తం చేసి.. బాధితురాలి వైద్యసహాయాన్ని పర్యవేక్షించాలని సూచించారు. ఈ మేరకు వాసిరెడ్డి పద్మ పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడిన కొద్దిగంటల్లోనే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రిన్సిపాల్ విజయకుమార్ ను అరెస్టు చేశారు. అతనిపై పోక్సోకు మించిన సెక్షన్లతో కఠినచర్యలు చేపట్టాలని వాసిరెడ్డి పద్మ ఆదేశాలిచ్చారు. వారం రోజుల్లో చార్జిషీట్ ను  దాఖలు చేసి నిందితుడికి కఠిన శిక్ష అమలయ్యేలా చూడాలన్నారు.