బంజారాహిల్స్‌ డ్ర‌గ్స్ కేసు.. రిమాండ్ రిపోర్టు ఇదే!

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచ‌ల‌నం రేపిన బంజారాహిల్స్‌ పుడింగ్ ప‌బ్‌ డ్ర‌గ్స్ కేసులో రిమాండ్ రిపోర్టు బ‌య‌ట‌కు వ‌చ్చింది. పబ్‌లో మద్యం, డ్రగ్స్‌ విక్రయాలపై సమాచారం వచ్చిందని రిమాండ్‌ రిపోర్ట్ లో పోలీసులు వెల్లడించారు. ఈ నెల 3న పబ్‌పై టాస్క్‌ఫోర్స్ దాడి చేసినట్లు తెలిపారు. రాడిసన్ బ్లూప్లాజాలోని పుడింగ్ పబ్‌లో పోలీసుల తనిఖీలు చేసినట్లు చెప్పారు. ల్యాప్‌టాప్, ప్రింటర్, ప్యాకింగ్ మెటీరియల్ గుర్తించినట్లు పేర్కొన్నారు. సులభంగా డబ్బు సంపాదనకు పబ్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, పబ్‌లో 5 డ్రగ్స్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు చెబుతూ పబ్‌ మేనేజర్ అనిల్‌కు చెందిన ట్రేలో డ్రగ్స్ లభ్యమైనట్లు పేర్కొన్నా రు.

ప్యాకెట్లలోని తెల్లని పౌడర్ కొకైన్‌గా తేలిందని చెప్పారు. కొకైన్ 4.64 గ్రాముల బరువు ఉందని.. అనిల్‌ను అరెస్ట్ చేసి సెల్‌ఫోన్‌, ఐపాడ్ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు చెప్పారు. అనిల్ ఇచ్చిన సమాచారంతో పబ్ నిర్వాహకుడు అభిషేక్ అరెస్టు చేసినట్లు వెల్లడించారు. అభిషేక్‌ను అరెస్ట్ చేసి ఐఫోన్ సీజ్ చేశామని… ఎన్డీపీఎస్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు రిమాండ్‌ రిపోర్ట్లో పోలీసులు వివరించారు.

హైదరాబాద్ బంజారాహిల్స్ పుడింగ్ అండ్‌ మింక్‌ పబ్‌లో ఈ నెల 3వ తేదీ అర్ధరాత్రి కొకైన్‌, గంజా, ఎల్ఎస్‌డీ మత్తు పదార్థాలు సేవిస్తూ పెద్ద ఎత్తున పార్టీ జరుగుతోందని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు సమాచారం అందడంతో డేకాయ్ ఆపరేషన్‌ నిర్వహించారు. పోలీసులను గుర్తించిన యువతీ యువకులు వారి వద్ద ఉన్న మత్తు పదార్థాలను కిటకీల గుండా బయట పారేసి కనిపించకుం దాచేశారు. పక్కా సమాచారంతో ఉత్తర మండల, మధ్య మండల, పశ్చిమ మండల టాస్క్‌ఫోర్స్ పోలీసులు పబ్‌ను చుట్టుముట్టారు.

పబ్లో ఉన్న యువతీ యువకులు, నిర్వాహకులు, సిబ్బందితో సహా మొత్తం 148 మందిని అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. వీరితో పాటు పబ్‌ సమీపంలో ఉన్న డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో నటి నిహారిక, సింగర్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ సహా పలువురు ప్రముఖుల కుమారులు, కుమార్తెలు ఉన్నారు. పోలీసు అధికారుల పిల్లలు కూడా ఉన్నట్లు ప్రచారం జ‌రిగిన విష‌యం తెలిసిందే. తెల్లవారుజామున 3 గంటల సమయంలో వీరందరిని బంజారాహిల్స్ ఠాణాకు తరలించిన పోలీసులు వారి వివరాలను నమోదు చేసుకుని పంపించారు. తాజాగా దీనికి సంబంధించిన రిమాండ్ రిపోర్టును కోర్టుకు స‌మ‌ర్పించారు.