రష్యా భారీ మూల్యమే చెల్లించిందా ?

రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో రెండువైపులా భారీ నష్టాలు కనబడుతున్నాయి. ఉక్రెయిన్ సంగతిని పక్కన పెట్టేస్తే అగ్రరాజ్యం తో పోటీపడుతున్న రష్యా భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. చిట్టెలుకే కదాని ముందు ఉక్రెయిన్ను తేలిగ్గా తీసుకున్న కారణంగానే భారీగా నష్టపోవాల్సొచ్చిందట. ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ప్రకారం 12 వేల మంది రష్యా సైనికులు చనిపోయారట. ఉక్రెయిన్ పై యుద్ధంలోనే ఇన్ని వేల మంది చనిపోవడం చిన్న విషయం కాదు.

పైగా చనిపోయిన వారిలో ముగ్గురు అత్యున్నత స్థాయి అధికారులు కూడా ఉన్నారు. ఇద్దరు ఒక మేజర్ జనరల్ తో పాటు ఇద్దరు జనరల్ స్థాయి అధికారులుండటం రష్యాకు పెద్ద దెబ్బనే చెప్పాలి. చనిపోయిన సైనికులు కాకుండా 49 ఫైటర్ విమానాలు, 80 ఫైటర్ హెలికాప్టర్లు, 303 యుద్ధ ట్యాంకులు, 1100 ఆర్మీ వాహనాలు, 30 యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ వార్ ఫేర్ సిస్టమ్స్ ను ధ్వంసం చేసినట్లు తెలిపింది.

రష్యా ముందు ఉక్రెయిన్ ఏమాత్రం నిలవలేదు. అందుకనే మొదటి నుండి చాలా తేలిగ్గా తీసుకుంది. అయితే యుద్ధం మొదలైన మూడు రోజుల తర్వాత ఉక్రెయిన్ దగ్గరున్న ఆయుధాలను చూసి రష్యా ఆశ్చర్యపోయింది. నిజానికి రష్యా యుద్ధ విమానాలు, యుద్ధ హెలికాప్టర్లను కూల్చేసేంత సీన్ ఉక్రెయిన్ రక్షణశాఖ దగ్గర లేదు. రష్యా మీద కోపంతో అమెరికా స్టింగర్ యాంటి ట్యాంకు మిస్సైల్స్ ను, విమానాలు, హెలికాప్టర్లను కూల్చేయగలిగిన క్షిపణులను ఉక్రెయిన్ కు అందించింది.

అమెరికాతో పాటు ఫ్రాన్స్, జర్మనీ, చెకొస్లొవేకియా, స్వీడన్ లాంటి దేశాలు అత్యంత ఆధునిక ఆయుధాలను అందించాయి. అందించటమే కాకుండా ఎలా ఉపయోగిస్తే రష్యా విమానాలు, యుద్ధ ట్యాంకులు, హెలికాప్టర్లను కూల్చవచ్చో సూచనలిచ్చి మరీ కూల్చివేశాయి. దాంతోనే రష్యాకు భారీ నష్టాలు వచ్చాయి. ఇక ఉక్రెయిన్ సైన్యంతో పాటు మామూలు జనాలు కూడా ప్రభుత్వం అందించిన తుపాకులు, గ్రనేడ్లు యధేచ్చగా ప్రయోగిస్తుండటతో రష్యాకు చుక్కలు కనబడుతున్నాయి. అందుకనే ఆయుధాల ధ్వంసంతో పాటు వేలాది మంది సైన్యం చనిపోయారు.  చిట్టెలుక ఉక్రెయిన్ సైన్యం చనిపోవటం గొప్పకాదు. రష్యా సైన్యం చనిపోవటమే పెద్ద దెబ్బ.