రష్యాకు మరో షాక్ ఇచ్చిన అమెరికా

ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ నష్టపోయిన దానికంటే రష్యానే ఎక్కు వగా నష్టపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రష్యాపై అమెరికాతోపాటు పలు దేశాలు ఆంక్షలు విధించడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. ఈ క్రమంలోనే రష్యాను ఎకానమీ పాతాళానికి పడిపోయేలా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రష్యా ముడి చమురు, గ్యాస్ ను నిషేధిస్తున్నట్లు బైడెన్ ప్రకటించారు.

అంతేకాదు, ఉక్రెయిన్ కు అండగా ఉంటామన్న బైడెన్.. ఆ దేశానికి నిధులు అందజేస్తామని హామీ ఇచ్చారు. దీంతోపాటు, రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించేందుకు కూడా బైడెన్ సిద్ధమయ్యారు. ఆధునిక టెక్నాలజీ, సెమీకండక్టర్లలపై ఆంక్షల వల్ల రష్యా సైన్యం బలహీనపడుతుందని బైడెన్ అన్నారు.

అమెరికా స్టాక్ ఎక్స్ ఛేంజ్ లు రష్యా సెక్యూరిటీల ట్రేడింగ్ ను నిలిపేశాయని, దీంతో, ,రూబుల్ విలువ 50 శాతం క్షీణించిందని చెప్పారు. తాజాగా అన్ని దేశాల నుంచి రష్యా ఎదుర్కొంటోన్న ఐదున్నర వేల ఆంక్షల నేపథ్యంలో రష్యా కరెన్సీ ఒక్క పెన్నీ కూడా విలువ చేయదని బైడెన్ హెచ్చరించారు. అయితే, తమపై ఆంక్షలు విధించిన దేశాలకు రష్యా వార్నింగ్ ఇచ్చింది.

ఆయా దేశాలపై తాము కూడా ఆంక్షలు విధిస్తామని రష్యా హెచ్చరించింది. ఏయే దేశాలపై ఎటువంటి ఆంక్షలు విధించాలన్న యోచనలో ఉన్నామని రష్యా విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారి అన్నారు. మరోవైపు, రష్యాతో నాటో బలగాలు యుద్ధం చేయబోవని, నాటో సభ్యత్వం కోసం ఒత్తిడి చేయబోనని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ప్రకటించారు. దీంతో, దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,223 పాయింట్లు లాభపడి 54,647కి చేరుకుంది. నిఫ్టీ 331 పాయింట్లు పెరిగి 16,345కి ఎగబాకింది.