ప్రపంచకప్ విజయంలో తెలుగు క్రికెటర్

దేశంలో యువ క్రికెట్ ప్రతిభకు లోటే లేదని మరోసారి రుజువైంది. రికార్డు స్థాయిలో భారత్ అండర్-19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలుచుకుంది. వరుసగా నాలుగ ప్రపంచకప్‌ల్లో యువ భారత్ ఫైనల్ చేరడం.. రెండుసార్లు కప్పు సాధించడం విశేషం. ఐతే గత మూడు ప్రపంచకప్పుల్లో తెలుగు కుర్రాళ్లెవరికీ జట్టులో ప్రాధాన్యం లభించలేదు. తుది జట్టులో ఆడి సత్తా చాటిన కుర్రాళ్లెవరూ కనిపించలేదు.

కానీ ఈసారి మాత్రం భారత్ అండర్-19 కప్ గెలవడంలో మన క్రికెటర్‌ది కీలక పాత్ర. ఆ కుర్రాడి పేరు.. షేక్ రషీద్. ఇతను గుంటూరు కుర్రాడు కావడం విశేషం. రషీద్ కేవలం జట్టు సభ్యుడు కాదు.. జట్టుకు వైస్ కెప్టెన్. అలాగే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ కూడా. ఐతే టోర్నీలో అడుగు పెట్టే సమయానికి రషీద్‌ను దురదృష్టం కరోనా రూపంలో వెంటాడింది. వైరస్ బారిన పడిన ఐదారుగురు ఆటగాళ్లలో అతనూ ఒకడు.

దీంతో లీగ్ దశలో కొన్ని మ్యాచ్‌లు, అలాగే క్వార్టర్ ఫైనల్‌కు అతను దూరమయ్యాడు.ఐతే కరోనా నుంచి కోలుకుని ఆస్ట్రేలియాతో సెమీస్‌లో పునరాగమనం చేసిన అతను అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆరంభంలోనే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును 94 పరుగుల గొప్ప ఇన్నింగ్స్‌తో పుంజుకునేలా చేశాడు. ఆ మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. ఇక ఫైనల్లోనూ రషీద్ మరో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అర్ధశతకంతో జట్టు విజయంలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌లతో రషీద్ పేరు మార్మోగిపోయింది.

రవిచంద్రన్ అశ్విన్ సహా ఎంతోమంది పేరున్న క్రికెటర్లు అతడి మీద ప్రశంసల జల్లు కురిపించారు. బెదురు లేకుండా దూకుడుగా ఆడే అతడి బ్యాటింగ్ శైలి అందరికీ నచ్చేసింది. త్వరలోనే అతను ఐపీఎ్‌లో అడుగు పెడితే ఆశ్చర్యం లేదు. సీనియర్ స్థాయిలోనూ నిలకడగా ఆడితే టీమ్ ఇండియా తలుపు తట్టడం కూడా కష్టం కాకపోవచ్చు. రషీద్ కుటుంబ నేపథ్యం విషయానికి వస్తే.. అతడిది మామూలు మధ్య తరగతి కుటుంబం. ఇలాంటి నేపథ్యం నుంచి వచ్చి చిన్న వయసులో ఈ స్థాయికి చేరుకోవడం విశేషమే. రషీద్ టీమ్ ఇండియా స్తాయికి ఎదిగి సత్తా చాటుతాడేమో చూద్దాం.