హైదరాబాద్ లో కొత్త ట్రెండ్.. ఇంటికి బంగారు మెరుపులు

‘నీ ఇల్లు బంగారం కాను’ అన్న సామెత సంగతేమో కానీ.. ఇప్పుడు చేతిలో డబ్బులు ఉండాలే కానీ.. ఇంటిని బంగారంలా మార్చేస్తున్న వైనం ఎక్కువైంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే.. హైదరాబాద్ మహానగరంలో ఈ ట్రెండ్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. ఖరీదైన ఇళ్లను కొనుగోలు చేయటం ఒక ఎత్తు. వాటికి అందుకు తగ్గట్లు ముస్తాబు చేయటం మరో ఎత్తు. ప్రధాన ద్వారం మొదలుకొని.. కార్పెట్లు.. కర్టెన్లు.. వాల్ పేపర్స్.. లైట్లు..సీలింగ్.. ఫర్నీచర్ మొత్తం బంగారు వర్ణంలో తళుకులీనేలా సిద్ధం చేయటం ఎక్కువైంది.

ఇందుకోసం విదేశాల నుంచి లిమిటెడ్ ఎడిషన్ ఇంటీరియర్స్ ను దిగుమతి చేసుకొని ఇంటిని బంగారం చేసుకోవడం ఈ మధ్యన కొత్త ట్రెండ్ గా మారింది. 24 క్యారెట్ గోల్డ్ లీఫింగ్ తో ఇంటికి కొత్త నగిషీలు చెక్కుతున్నారు. ఇందుకోసం టర్కీ.. ఇటలీ దేశాల నుంచి నిపుణులు వచ్చి మరీ.. ఇంటిని యజమానుల అభిరుచి మేరకు సరికొత్త హంగులు సమకూరుస్తున్నారు.

దీంతో రాజభవనాలను తలపించేలా ఇళ్లు తయారవుతున్నాయి. హైదరాబాద్ మహానగరంలో ఇటీవల కాలంలో విలాసవంతమైన లగ్జరీ విల్లాలు.. అపార్ట్ మెంట్లు ఎక్కువ అవుతున్నాయి. ఇండిపెండెంట్ హౌస్ లను సైతం భారీగా తీర్చి దిద్దుతున్నారు. ఇందులో భాగంగా 24 క్యారెట్ల గోల్డ్ లీఫింగ్ తో ఇంటీరియర్ చేయిస్తున్న వైనం ఎక్కువైంది. ఈ తరహా ఇంటీరియర్స్ ను సిద్ధం చేయటం కోసం విదేశాల నుంచి ఇంటీరియర్ నిపుణుల్ని తీసుకొస్తున్నారు. అయితే.. వీరు చిన్నా చితకా పనుల కోసం రారు.

కనీసం 10 వేల చదరపు అడుగులు.. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇంటీరియర్ చేయాలంటేనే వస్తున్నారు. ఖర్చు కోసం చదరపు అడుగుకు కనీసం రూ.800 నుంచి రూ.4500 వరకు ఉంటుందని.. ప్రాజెక్టు మొత్తం పూర్తి కావటానికి కనీసం రూ.5 నుంచి రూ10 కోట్ల మధ్య ఖర్చు అవుతుందని చెబుతున్నారు.ఈ బంగారు ఇంటీరియర్ కోసం కనీసం నెల నుంచి మూడు నెలల సమయం తీసుకుంటారని చెబుతున్నారు. ఈ కొత్త ట్రెండ్ సంపన్నుల్ని విపరీతంగా ఆకర్షిస్తోందని చెబుతున్నారు.