పాకిస్థాన్ క్రికెట్ పనైపోయినట్లే


ఏడెనిమిదేళ్ల పాటు సొంతగడ్డపై అంతర్జాతీయ క్రికెట్ సిరీస్‌లు, టోర్నీలు, లీగ్‌లు ఏవీ లేక అల్లాడిపోయింది పాకిస్థాన్. రాజకీయాల్ని, క్రీడల్ని కలిపి చూడొద్దని పాకిస్థాన్ అంటుంటుంది కానీ.. ఉగ్రవాద కార్యకలాపాలకు ఊతం ఇస్తూ, తమ దేశ పర్యటనకు వచ్చిన జట్టు మీదే ఉగ్ర దాడి జరుగుతుంటే ఏమీ చేయలేకపోయిన దేశానికి వెళ్లి క్రికెట్ ఆడాలని ఏ దేశమైనా ఎలా కోరుకుంటుంది? అందుకే చాలా ఏళ్ల పాటు ఏ జట్టూ ఆ దేశం గడప తొక్కలేదు. గత రెండు మూడేళ్లలో పరిస్థితు మారి.. చిన్న జట్లు కొన్ని ఆ దేశంలో పర్యటించడం.. పాకిస్థాన్ సూపర్ లీగ్ కోసం విదేశీ క్రికెటర్లు ఆ దేశానికి వెళ్లడంతో పరిస్థితులు మారినట్లు కనిపించాయి.

లేక లేక న్యూజిలాండ్ లాంటి పెద్ద జట్టు ఆ దేశంలో వన్డే, టీ20 సిరీస్‌లు ఆడేందుకు వెళ్లింది. కానీ సరిగ్గా తొలి వన్డే ఆరంభం కాబోతున్న సమయానికి తమ భద్రతకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో ఆ జట్టు పాకిస్థాన్‌కు ఝలక్ ఇచ్చి స్వదేశానికి బయల్దేరింది.

న్యూజిలాండ్ నిర్ణయం పాకిస్థాన్‌కు మామూలు షాక్ కాదు. ఆ జట్టును మళ్లీ కొన్నేళ్ల వెనక్కి తీసుకెళ్లిపోయింది. అసలు న్యూజిలాండ్ భద్రతకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ సమాచారం ఇచ్చింది బ్రిటన్ అన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే వచ్చే నెలలో పాకిస్థాన్ పర్యటనకు వెళ్లాల్సిన ఇంగ్లాండ్ జట్టు ఇప్పుడా టూర్‌ను రద్దు చేసుకుంది. న్యూజిలాండ్ వెళ్లిపోగానే.. మిగతా జట్లు కూడా పాక్‌లో పర్యటనకు భయపడతాయనే అంతా అనుకున్నారు. అనుకున్నట్లే ఇంగ్లాండ్ కూడా పాక్‌కు హ్యాండ్ ఇచ్చేసింది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ వెనక్కి తగ్గాక ఇక ఆస్ట్రేలియా మాత్రం ఏ ధైర్యంతో పాక్‌కు వెళ్తుంది. ఈ ఏడాది చివర్లో పాక్‌లో ఆసీస్ పర్యటన కూడా రద్దవడం లాంఛనమే అని భావిస్తున్నారు.

దీంతో పాకిస్థాన్లో అంతర్జాతీయ క్రికెట్ పుంజుకోవడం ఇక అసాధ్యం అని తేలిపోయింది. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ జట్ల నిర్ణయానికి పరోక్షంగా అఫ్గానిస్థాన్ పరిణామాలు కూడా కారణమవుతున్నట్లుగా భావిస్తున్నారు. అక్కడ తాలిబన్ల రాజ్యం రావడానికి పరోక్షంగా పాకిస్థాన్ సహకారం ఉందన్నది బహిరంగ రహస్యం. భద్రత ముప్పుకు తోడు ఇలాంటి దేశానికి వెళ్లి క్రికెట్ ఆడటం ఎంత వరకు సమంజసం అన్న ప్రశ్నలతో పాశ్చాత్య జట్లు వెనక్కి తగ్గుతున్నట్లు స్పష్టమవుతోంది.