చెప్పి మరీ కొట్టారు.. వీళ్లకు వేయాలి వీరతాడు

‘‘ఐదు స్వర్ణాలు సహా 15 పతకాలు గెలుస్తాం’’.. పారాలింపిక్స్‌కు బయల్దేరే ముందు భారత అథ్లెట్ల బృందం ఉమ్మడిగా చేసిన ప్రకటన ఇది. ఐతే ఇప్పటిదాకా భారత్ పాల్గొన్న అన్ని పారాలింపిక్స్‌లో కలిపి సాధించిన పతకాలు 12 మాత్రమే. అలాంటిది ఈ ఒక్కసారే 15 పతకాలు.. అందులోనూ 5 స్వర్ణాలు గెలుస్తాం అంటుంటే టూమచ్ అనే అనిపించింది చాలామందికి.

ఒలింపిక్స్, పారాలింపిక్స్ ముంగిట అథ్లెట్లు ఇలా ఘనంగా ప్రకటనలు చేయడం.. తీరా అసలు పోటీల్లోకి వెళ్లేసరికి అంచనాలకు దూరంగా నిలిచిపోవడం మామూలే కాబట్టి టోక్యోలోనూ అదే జరుగుతుందని అనుకున్నారు.

కానీ ఇప్పుడు పోటీల ముగింపు రోజు నాటికి భారత్ సాధించిన పతకాలు చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఈవెంట్ ఆరంభానికి ముందు అన్నట్లే ఐదు స్వర్ణాలు సాధించారు భారత క్రీడాకారులు. ఇక ఓవరాల్ పతకాల సంఖ్య 15 కాదు.. 19కి చేరడం విశేషం.

షూటర్ అవని లేఖరా టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం అందిస్తే.. ఆ తర్వాత జావెలిన్ త్రోయర్ సుమిత్ అంటిల్ దేశం ఖాతాలో రెండో పసిడి జమ చేశాడు. ఇక పోటీల ముగింపునకు ఒక్క రోజు ముందు భారత్‌కు రెండు స్వర్ణాలు దక్కాయి. బ్యాడ్మింటన్ క్రీడాకారుడు ప్రమోద్ భగత్.. షూటర్ మనీష్ నర్వాల్ భారత్‌ను స్వర్ణ సంబరంలో ముంచెత్తారు.

ఇక పారాలింపిక్స్ చివరి రోజు బ్యాడ్మింటన్లో భారత్‌కు మరో బంగారు పతకం దక్కింది. కృష్ణా నగర్ ఎస్‌హెచ్4 విభాగంలో విజేతగా నిలిచి టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు తిరుగులేని ముగింపు ఇచ్చాడు.

చివరి రోజు మరో పసిడి కూడా దక్కాల్సింది కానీ.. మరో స్టార్ షట్లర్, ఐఏఎస్ అధికారి కూడా అయిన సుహాస్ యతిరాజ్ త్రుటిలో ఓటమి పాలై రజతంతో సరిపెట్టుకున్నాడు. భారత్ 5 స్వర్ణాలు, 8 రజతాలు, 6 కాంస్యాలతో మొత్తంగా 19 పతకాలు సాధించిన క్రీడల చరిత్రలోనే అత్యుత్తమంగా 24వ స్థానంలో టోక్యో పారాలింపిక్స్‌ను గొప్పగా ముగించింది.