గుంటూరు దారుణ హత్యలో మరిన్ని విషయాలు బయటకు

ప్రేమ అంటూ వెంటపడతారు. ఆపై తమకు నచ్చినట్లు ఉండలేదంటూ దారుణంగా హత్య చేయటం ఈ మధ్యన ప్రేమోన్ముదులకు అలవాటుగా మారింది. తాజాగా అలాంటి దారుణ ఉదంతం ఏపీలోని గుంటూరు నడిరోడ్డు మీద చోటు చేసుకుంది. పంద్రాగస్టు వేళ.. అందరూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్న వేళ.. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు కేవలం కిలోమీటరు దూరంలో ఉన్న రోడ్డు మీద రమ్య అనే యువతిని రెండు దెబ్బలు కొట్టి రోడ్డు మీద పడేసి.. ఆ తర్వాత తనతో తెచ్చుకున్న కత్తితో ఆమెను ఆరు పోట్లు పొడి చేసి.. పారిపోయాడు. ఇంత జరుగుతున్నా.. ఎవరు ముందుకు రాకుండా.. జరుగుతున్నదంతా చూశారే తప్పించి..ఆదుకునేందుకు ఒక్కరు అడుగు ముందుకు వేయలేదు.

కొన్ని నిమిషాల పాటు సాగిన ఈ హత్యాకాండకు సీసీ కెమేరాలోని వీడియోలు సాక్ష్యంగా నిలిచాయి. మానవత్వం సిగ్గుపడేలా.. అక్కడే ఉండి సిత్రం చూస్తున్న వారంతా నిలిచారు. ఇంతకు బాధితురాలు ఎవరు? ఆమెకు చంపేసిన వ్యక్తికి ఎలా పరిచయం? హత్యాకాండ ఎందుకు చోటు చేసుకుంది? నరహంతకుడు ఎక్కడ ఉన్నాడు? లాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికితే..

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరు గ్రామానికి చెందిన రమ్య (19) గుంటూరు సమీపంలోని సెయింట్ మేరీస్ ఇంజనీరింగ్ కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. పరీక్షలు రాసేందుకు నెల క్రితం గుంటూరులోని పెదకాకాని రోడ్డు దగ్గర ఉండే నానామ్మఇంటికి వచ్చి ఉంటోంది. ఆమెకు ముట్లూరు గ్రామానికిచెందిన శశికృష్ణతో ఫేస్ బుక్ లో పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానంటూ వెంట పడేవాడు. ఆదివారం ఉదయం నానమ్మకు టిఫిన్ తెచ్చింది రమ్య. ఇది జరిగిన కాసేపటికి శశికృష్ణ నుంచి ఫోన్ రావటంతో ఇప్పుడే వస్తానంటూ బయటకు వెళ్లింది.

రోడ్డు మీదకు వచ్చిన రమ్య.. శశికృష్ణ బైక్ మీద ఎక్కగా వారు కొంతదూరం ప్రయాణించారు. మధ్యలో వచ్చిన మాట తేడాతో ఆమె బండి దిగి రోడ్డు దాటి అవతలవైపునకు వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహంగా బండిని తిప్పి వచ్చిన అతడు.. రమ్యను రెండు దెబ్బలు వేశాడు. దీంతో.. ఆమె కింద పడిపోయింది. వెంటనే.. తనతో తెచ్చుకున్న కత్తితో ఆరు పోట్లు విచక్షణారహితంగా పొడిచేశాడు. రోడ్డు మీద ఇంత దారుణం జరుగుతున్నా.. ఏ ఒక్కరు దీన్ని ఆపే ప్రయత్నం చేయలేదు.ఆమెను చంపేసి.. అనంతరం పరారయ్యాడు. అతని ఫోన్ స్విచాప్ చేసుకున్నాడు. బాధితురాలిని ఆసుపత్రికి తరలించే సమయానికే ఆమె చనిపోయింది.

రమ్యను పొడిచేసిన తర్వాత పరారైన శశికృష్ణ అతడి తల్లి ఉండే గోళ్లపాడు గ్రామానికి వెళ్లిపోయాడు. శశికృష్ణ తల్లిదండ్రులు విడిగా ఉంటున్నారు. దీంతో.. తల్లి ఉండే గ్రామానికి వెళ్లి శశికృష్ణను గుర్తించారు. అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేయగా.. తప్పించుకునే ప్రయత్నం చేశాడు. కానీ.. పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో రమ్యను పొడిచిన కత్తితో తన మెడను గాయపర్చుకునే ప్రయత్నం చేయగా.. పోలీసులు నిలువరించారు. మెడ దగ్గర స్వల్ప గాయం కావటంతో అతడికి చికిత్స చేయించి.. పాత గుంటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ ఉదంతం ఏపీ వ్యాప్తంగా సంచలనంగా మారింది. నిందితుడికి ఉరిశిక్ష విధించాలన్న డిమాండ్ అందరి నోట వస్తోంది. విభేదాలు ఉంటూ కూర్చొని సామరస్యంగా పరిష్కరించుకోవాలే తప్పించి.. ఇలా దారుణంగా చంపేస్తారా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఉదంతంపై సీఎం జగన్ విచారం వ్యక్తం చేసి.. బాధితురాలి కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.