ఆ పేరు వారికి బిర్యానీ ఫ్రీ.. ఎక్కడో తెలుసా..?

టోక్యో ఒలంపిక్స్ లో భారత క్రీడాకారులు అదరగొట్టారు. ముఖ్యంగా ఈ ఒలంపిక్స్ లో బంగారు పతకం రావడం కలగానే మిగిలిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ కలను నీరజ్ చోప్రా నిజం చేశాడు. దీంతో ఎక్కడ చూసినా నీరజ్ పేరే మార్మోగిపోతోంది. భారత్ వందేళ్ల కలను సాకారం చేసిన ధీరుడిగా ఆయన్ను తెగపొగిడేస్తున్నారు భారతీయులు. అవును.. ఏళ్ల కలను సాకారం చేసినందుకుగాను ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఈ క్రమంలోనే నీరజ్‌పైన ఉన్న అభిమానాన్ని కొందరు వినూత్నంగానూ చాటుకుంటున్నారు. నీరజ్ పేరు కలిగిన వారందరికీ ఉచితంగా బిర్యానీ పంచిపెడుతున్నట్లు ఓ రెస్టారెంట్ ప్రకటించడం గమనార్హం. ఈ బంపర్ ఆఫర్ ఆంధ్రప్రదేశ్ లోనే కావడం విశేషం.

పూర్తి వివరాల్లోకి వెళితే.. ‘చిల్లీస్’ రెస్టారెంట్ ఓనర్ మాత్రం నీరజ్‌పై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటుకుంటున్నాడు. ‘నీరజ్’ పేరున్న పర్సన్స్‌కు సూపర్బ్ ఆఫర్ ప్రకటించాడు. ధీరుడైన నీరజ్ పేరు పెట్టుకున్న ప్రతీ ఒక్కరికి ఈ నెల 10, 11, 12 తేదీలలో తిరుపతి, కడప నగరాల్లోని ‘చిల్లీస్’ రెస్టారెంట్‌లో చికెన్ బిర్యానీ మినీ ప్యాక్‏ను ఉచితంగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, ఈ బిర్యానీ పొందే ముందర సదరు పేరున్న వ్యక్తులు వారి ఆధార్ కార్డు జిరాక్స్‌ను ఇవ్వాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలోనే ‘చిల్లీస్’ ఓనర్ ప్రకటనకు సంబంధించిన పోస్టర్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ‘నీరజ్’ పేరున్న వ్యక్తులు వెంటనే కడప, తిరుపతికి వెళ్లండి అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘చిల్లీస్’ రెస్టారెంట్ ఓనర్ గ్రేట్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇకపోతే గుజరాత్ రాష్ట్రంలోని బరూచ్‏లో ఉన్న ఓ పెట్రోల్ బంకు యాజమాని నీరజ్‌పై ఉన్న అభిమానంతో ‘నీరజ్’ పేరున్న వ్యక్తులందరికీ రూ. 501 విలువగల పెట్రోల్ ఫ్రీగా ఇవ్వనున్నట్లు ప్రకటించాడు. అయతే, ఇక్కడ కూడా పెట్రోల్ తీసుకునే ముందర పేరుకు సంబంధించిన పత్రాలు ఆధార్ లేదా ఓటర్ ఐడీ జిరాక్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.