ఐపీఎల్ షెడ్యూల్ ఫిక్స్.. మనకు అన్యాయమే


ఇండియన్ ప్రిమియర్ లీగ్ 14వ సీజన్ షెడ్యూల్ విషయంలో నెలకొన్న సస్పెన్సుకి ఎట్టకేలకు తెరపడింది. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఏప్రిల్ 9న ఈ మెగా టోర్నీ మొదలు కాబోతోంది. అనుకున్నట్లుగానే టోర్నీ వేదికల నుంచి సన్‌రైజర్స్ హోం సిటీ అయిన హైదరాబాద్‌తో పాటు పంజాబ్, రాజస్థాన్ జట్ల సొంత నగరాలైన మొహాలి, జైపూర్‌లను తప్పించారు. దక్షిణాదిన మిగతా రెండు వేదికలైన చెన్నై, బెంగళూరుల్లో మాత్రం మ్యాచ్‌లు జరగబోతున్నాయి. అలాగే ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలను కూడా కొనసాగించనున్నారు.

ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియంగా రూపుదిద్దుకున్న అహ్మదాబాద్‌లోని మొతేరా మైదానాన్ని ఆరో వేదికగా ఎంపిక చేశారు. కరోనా నేపథ్యంలో వేదికల సంఖ్య తగ్గించాలని బీసీసీఐ భావించడంతోనే ఈ మార్పు చోటు చేసుకుంది. ఐతే ఇంతా చేసి తగ్గించింది రెండు వేదికలనే. అసలు ఏ ఫ్రాంఛైజీకి హోం సిటీ కాని అహ్మాబాద్‌లో ఐపీఎల్ నిర్వహించాలని పట్టుబట్టి కూర్చోవడమే విడ్డూరం.

ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దిన అతి పెద్ద స్టేడియానికి ఐపీఎల్ మ్యాచ్‌లు కేటాయించడం బీసీసీఐ కార్యదర్శి, హోం మంత్రి అమిత్ షా తనయుడు జై షా చక్రం తిప్పారనడంలో సందేహం లేదు. ఆ స్టేడియం వల్లే హైదరాబాద్ అవకాశం కోల్పోయింది. జైపూర్, మొహాలిలతో పోలిస్తే హైదరాబాద్‌లో క్రికెట్‌కు ఆదరణ ఎక్కువ. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుకూ ఇక్కడ మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా హైదరాబాద్‌లో ప్రస్తుతం కరోనా కేసులు చాలా తక్కువగా ఉన్నాయి.

ఇంత పేరున్న, మహా నగరంలో ఈసారి ఐపీఎల్ జరగకపోవడం కచ్చితంగా అన్యాయమే. ఇంకా విడ్డూరమైన విషయం ఏంటంటే.. ముంబయిలో కరోనా కేసులు మళ్లీ పెద్ద సంఖ్యలో నమోదవుతున్నప్పటికీ ఆ నగరానికి ఐపీఎల్ మ్యాచ్‌లు కేటాయించారు. కరోనా భయంతోనే వేదికల సంఖ్య తగ్గించినట్లు చెబుతున్న బీసీసీఐ.. ముంబయిని ఎంపిక చేయడంలో ఔచిత్యమేంటో? ఐపీఎల్-14 మే 30న ముగియనుండగా.. ప్లేఆఫ్‌ మ్యాచ్‌లతో పాటు ఫైనల్‌ను అహ్మదాబాద్‌లోనే నిర్వహించబోతుండటం గమనార్హం.