వైజాగ్ ఒక్కటే కాదు.. ఇంకో మూడు రాష్ట్రాల్లోనూ

నిన్నటి విశాఖపట్నం గ్యాస్ లీక్ ఉదంతం ఎంతటి దారుణ పరిణామాలకు దారి తీసిందో తెలిసిందే. 11 మంది ప్రాణాలు హరించిన ఈ ఉదంతం.. వందల మందిని ఆసుపత్రుల పాలు చేసింది. ఇప్పటికీ గోపాలపట్నంలో పరిస్థితి నియంత్రణలోకి రాలేదు. చుట్టు పక్కల ఐదు గ్రామాల ప్రజలు ఇల్లూ వాకిలి వదిలి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు.

ప్రస్తుతానికి ప్రాణాపాయం తప్పినప్పటికీ.. గ్యాస్ పీల్చిన వారికి మున్ముందు ఎలాంటి సమస్యలు ఉంటాయో అన్న ఆందోళన ఉంది. జనావాసాల మధ్య ఉన్న కంపెనీ.. ఎలాంటి ముందు జాగ్రత్తలు లేకుండా ఎలా పనుల్ని పున:ప్రారంభించిందన్నది అర్థం కావట్లేదు.

ఇందులో ఎల్జీ పాలిమర్స్ తప్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఐతే ఇలాంటి నిర్లక్ష్యం వేరే రాష్ట్రాల్లోనూ చోటు చేసుకుంది. నిన్న మరో మూడు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.

ఛత్తీస్ గఢ్‌ రాష్ట్రంలోని రాయ్ గఢ్‌లోనూ ఓ పేపర్ మిల్లులో గ్యాస్ లీక్ అయింది. తమిళనాడులోని కడలూరులో ఉణ్న ఎన్ఎల్సీ పవర్ స్టేషన్లో బాయిలర్ బ్లాస్ట్ జరిగింది. అలాగే మహారాష్ట్రలోని నాసిక్‌లో ఓ ఫార్మా ప్యాకేజింగ్ కంపెనీలు ఫైర్ బ్రేక్స్ జరిగాయి. నెలన్నర పాటు అన్ని రకాల పరిశ్రమలను ఆపేయడం.. ఈ కాలంలో ఎలాంటి మెయింటైనెన్స్ కూడా లేకపోవడంతో మళ్లీ పనులు ప్రారంభించేటప్పటికి ఇలాంటి ప్రతికూల పరిణామాలు చోటు చేసుకున్నట్లుంది.

లాక్ డౌన్ టైంలో మెయింటైనెన్స్ పనులు కూడా ఆపేయడం.. మళ్లీ ఫ్యాక్టరీల్ని పున:ప్రారంభించేటపుడు ఎలాంటి జాగ్రత్తలు చేపట్టాలో అవగాహన లేకపోవడం, నిపుణుల పర్యవేక్షణ కొరవడటంతో ఈ ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐతే మిగతా రాష్ట్రాల్లో జరిగిన ఉదంతాల వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ విశాఖలో మాత్రం తీవ్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 11 మంది ప్రాణాలు కోల్పోయారు. వందల మంది అస్వస్థతకు గురయ్యారు.