ఆంధ్రప్రదేశ్ లోని ఒక ప్రభుత్వ హాస్టల్ లో నిద్రస్తున్న విద్యార్థినుల జడలు కత్తిరించడం కలకలం రేపింది. కేవలం సింగిల్ జడ వేసుకున్న అమ్మాయిల జడలు మాత్రమే కత్తిరించడంతో ఇది ఆకతాయిల పనిగా అధికారులు భావిస్తున్నారు. అయితే ఈ దుశ్చర్యకు పాల్పడింది హాస్టల్ విద్యార్థినులా, సిబ్బందా అన్నది విచారణ చేస్తున్నారు. ఇంతకూ ఏమి జరిగిందంటే…
విశాఖపట్నం జిల్లా భీమిలి కస్తూర్బా పాఠశాలలో మొత్తం 38 మంది విద్యార్థినులు చదువుకుంటున్నారు. వీరికి రెండు గదులు కేటాయించారు. ఈ నెల 16 వ తేదీ రాత్రి ప్రమీల అనే టీచర్ స్టడీ అవర్ నిర్వహించారు. ఆ తరువాత 20 మంది విద్యార్థినులు ఒక గదిలో, మిగిలిన 28 మంది విద్యార్థినులు ఇంకో గదిలో నిద్రించారు. తెల్లవారిన తర్వాత కొంతమంది విద్యార్థినుల జడలు కత్తిరించినట్లు గుర్తించారు. దాంతో వారు భయాందోళనకు గురయ్యారు.
20 మంది నిద్రించిన గదిలో ఆరు మంది జడలు, 18 మంది నిద్రించిన గదిలో నలుగురి జడలు కత్తిరించినట్లు అధికారులు గుర్తించారు. విచిత్రం ఏమిటంటే కేవలం ఒక్క జడ వేసుకున్న వారి జడలు మాత్రమే కత్తిరించడం. చాలా మంది విద్యార్థినులు ఉన్నప్పటికీ సింగిల్ జడలను మాత్రమే కట్ చేయడం అనుమానాలకు తావిస్తుంది. విద్యార్థినులు తమ తలిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో ఈ ఘటన బయటకు వచ్చింది.
ఈ అమానుష ఘటనపై అధికారులు విచారణ ప్రారంభించారు. ఇది ఆకతాయిలు చేసిన పనిగా ప్రాధమికంగా నిర్ధారించారు. అయితే లోపలి వ్యక్తులు ప్రమేయం వుందా, బయటి నుంచి వచ్చి ఎవరైనా చేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. ఒకవేళ బయటి వ్యక్తులు చేసి వుంటే అర్ధరాత్రి విద్యార్థినులు గాఢ నిద్రలో వున్న సమయంలో లోపలకు ఎలా ప్రవేశించారు అన్నది అర్ధం కాకుండా ఉంది. ప్రస్తుతం విద్యార్థినులను ఒక్కొక్కరిని పిలిచి విచారిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థినుల్లో భయం నెలకొంది. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం పై విద్యార్థినుల తలిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates