ఢిల్లీలో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు టీనేజర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ముగ్గురు మైనర్లు కాగా, మరొకరికి 19 ఏళ్లు. తనకు తెలిసిన 17 ఏళ్ల బాలుడిని కలవడానికి వెళ్లిన తర్వాతే బాలిక హత్యకు గురైనట్లు పోలీసులు చెబుతున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం బాలిక శుక్రవారం రాత్రి ఆ బాలుడిని కలిసేందుకు వెళ్లింది. అతడు తన స్నేహితులతో కలిసి ఆమెపై లైంగిక దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం బయట చెబుతానని బాలిక చెప్పడంతో ఆమెను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు మద్యం మత్తులో ఉన్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఆదివారం ఉదయం స్వరూప్నగర్లోని కుషక్ రోడ్ సమీపంలోని పొలంలో బాలిక మృతదేహం కనిపించింది. అప్పటికే మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో మొదట ఆమె ఎవరనేది కూడా పోలీసులకు తెలియలేదు. పోస్టుమార్టంలో లైంగిక దాడి జరిగినట్లు తేలడంతో హత్య, అత్యాచారం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
నిందితులను గుర్తించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలోని 50కి పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. ఒక కెమెరాలో అనుమానాస్పదంగా కనిపించిన టెంపో ఆధారంగా దర్యాప్తు ముందుకు వెళ్లింది. ఆ వాహనాన్ని గుర్తించిన తర్వాత అందులో నలుగురు యువకులు ప్రయాణించినట్లు మరో ఫుటేజ్లో కనిపించింది. చివరకు టెంపోను గుర్తించి నలుగురినీ అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో రెండు కత్తులతో పాటు నిందితులు ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. బాలికపై దాడి ఎక్కడ జరిగింది, హత్యకు ముందు ఏం జరిగింది, నలుగురిలో ఎవరి పాత్ర ఏమిటనే విషయాలను ఇప్పుడు పోలీసులు విచారిస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates