హైదరాబాద్ ఐమాక్స్ వారణాసికి ముందే

దేశంలోనే అత్యధిక‌ సినీ అభిమానం ఉన్న‌ది తెలుగు రాష్ట్రాల్లోనే అంటే అతిశ‌యోక్తేమీ కాదు. కానీ ఇంత‌టి అభిమానం ఉన్న చోట ఐమాక్స్ స్క్రీన్ లేక‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌య‌మే. గ‌తంలో ప్ర‌సాద్ మ‌ల్టీప్లెక్స్‌లో కొన్నేళ్లు ఐమాక్స్ న‌డిచినా.. త‌ర్వాత లైసెన్స్ ర‌ద్ద‌యిపోయింది. ప‌దేళ్ల‌కు పైగా ఐమాక్స్ లేదు తెలుగు రాష్ట్రాల్లో.

ఐతే హైద‌రాబాద్‌లో త‌క్కువ వ్య‌వ‌ధిలో రెండు ఐమాక్స్ స్క్రీన్లు రాబోతుండ‌డం ప‌ట్ల‌ సినీ ప్రియులు ఎంతో ఎగ్జైట్మెంట్‌తో ఉన్నారు. అందులో ఒక‌టి ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో నిర్మాణంలో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇక్క‌డ గ‌తంలో సుద‌ర్శ‌న్ 70 ఎంఎం థియేట‌ర్ ఉన్న స్థానంలోనే ఏషియ‌న్ గ్రూప్, మ‌హేష్ బాబు భాగస్వామ్యంలో రెడీ అవుతున్న 6 స్క్రీన్ల మ‌ల్టీప్లెక్స్ రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే.

ఇక్క‌డ ఏషియ‌న్, మ‌హేష్ బాబు, విక్టరీ వెంక‌టేష్‌, రానా ద‌గ్గుబాటి క‌లిసి ఐమాక్స్ స్క్రీన్ తీసుకొస్తున్న సంగ‌తి కొన్ని నెల‌ల కింద‌టే వెల్ల‌డైంది. ఐతే ఈ స్క్రీన్ ఎప్పుడు మొద‌ల‌వుతుంద‌నే విష‌యంలో ఇప్ప‌టిదాకా క్లారిటీ లేదు. వ‌చ్చే ఏడాది ఏప్రిల్లో వార‌ణాసితోనే ఈ స్క్రీన్ మొద‌ల‌వుతుందేమో అనే అంచ‌నాతో ఉన్నారు సినీ ప్రియులు. కానీ అంత‌కంటే ముందే డిసెంబ‌రులోనే ఐమాక్స్ థియేట‌ర్ మొద‌లైపోతుంద‌ని ఏషియ‌న్ గ్రూప్ అధినేత సునీల్ నారంగ్ అప్‌డేట్ ఇచ్చారు.

డిసెంబ‌రు 18న డ్యూన్-3 రిలీజ్ కానుండ‌గా.. ఈ సినిమాతోనే ఐమాక్స్ స్క్రీన్లో షోలు ప‌డిపోతాయ‌ని ఆయ‌న చెప్పారు. నిజానికి ఈ మ‌ల్టీప్లెక్స్ కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యం అయింద‌ని.. ఆ టైంలోనే ఐమాక్స్ ప్ర‌తినిధి హైద‌రాబాద్‌కు రావ‌డం, ఆయ‌న్ని త‌న సోద‌రుడు ఈ మ‌ల్టీప్లెక్స్ నిర్మిత‌మ‌వుతున్న చోటికి తీసుకెళ్ల‌డం.. ఐమాక్స్ స్క్రీన్‌కు ఆ ప్ర‌తినిధి ఓకే చెప్ప‌డం జ‌రిగిన‌ట్లు సునీల్ తెలిపారు.

ఇక్క‌డ ఐమాక్స్ స్క్రీన్ రావాల్సిందే అని మ‌హేష్ బాబు ప‌ట్టుబ‌ట్టాడ‌ని.. త‌ర్వాతే తాము ఐమాక్స్ ప్ర‌తినిధితో మాట్లాడి ఓకే చేశామ‌ని సునీల్ వెల్ల‌డించారు. ఇక్క‌డ ఆరు స్క్రీన్లు వేటిక‌వే భిన్న‌మ‌ని.. ఇందులో 4డీఎక్స్ స్క్రీన్ కూడా ఉంద‌ని సునీల్ తెలిపారు. కాగా హైద‌రాబాద్‌లోనే హ‌కీంపేట‌లో ఏషియ‌న్ గ్రూప్ ఆధ్వ‌ర్యంలోనే మ‌రో ఐమాక్స్ స్క్రీన్ కూడా రాబోతోంది. దాని గురించి ఇంకా అధికారిక అప్‌డేట్ రాలేదు.