రవితేజ వాడుతున్న దీపం ఫార్ములా

పెద్దల సామెత ఒకటి ఎప్పటికీ ఎవర్ గ్రీన్. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఊరికే చెప్పలేదు. ఇప్పటికీ ఎందరో దాన్ని పాటిస్తూనే ఉంటారు. కాకపోతే ప్రాక్టికల్ గా ఆలోచించడం చాలా అవసరం. ఇరుముడి లాంటి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ తో తిరిగి ఫామ్ లోకి వచ్చిన రవితేజ ఇప్పుడు ఈ ఫార్ములానే ఫాలో అవుతున్నాడని టాక్. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం హసిత్ గోలి దర్శకత్వంలో నిర్మాత దిల్ రాజు తలపెట్టిన సినిమా ఇకపై ముందుకు వెళ్లకపోవచ్చని తెలుస్తోంది.

అధికారికంగా ప్రకటించలేదు కానీ దీనికి సంబంధించిన వార్తలు రాకపోవచ్చని అంటున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రవితేజ ఈ సినిమాకు గాను ఇరవై కోట్ల రెమ్యునరేషన్ తో పాటు నైజామ్ హక్కులు కూడా అడిగారట. ఇలా అయితే వర్కౌట్ కాదని భావించిన ఎస్విసి టీమ్ ముందుకు వెళ్లడం సేఫ్ కాదని భావించారట. దాని స్థానంలోనే ఒకప్పటి దిల్ రాజు భాగస్వామి లక్ష్మణ్ ప్రొడక్షన్ లో వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్.

మాస్ రాజా డిమాండ్లకు లక్ష్మణ్ ఎస్ చెప్పినట్టు వినికిడి. ఇక్కడ రవితేజ రైటా రాంగా అనే నిర్ణయానికి రాలేం. ఎందుకంటే మార్కెట్ డిమాండ్ ని బట్టే హీరోలు తీసుకునే లెక్కలు మారిపోతాయి. బాహుబలి ముందు ప్రభాస్, కెజిఎఫ్ ముందు యష్, పుష్ప ముందు అల్లు అర్జున్ తీసుకున్న పారితోషికానికి ఇప్పటికి ఎంత వ్యత్యాసం ఉందో చూస్తున్నాం. ఇరుముడి తర్వాత రవితేజ కూడా ఇంచుమించు అదే ఫేజ్ ఎంజాయ్ చేస్తున్నాడు. అందుకే ఫీజులో పెంపు చేసుకుని ఉండొచ్చు.

కాకపోతే అన్ని ఇరుముడి స్థాయిలో ఆడితేనే రవితేజ నిర్మాతలకు పైన చెప్పిన ధర గిట్టుబాటు అవుతుంది. దానికి ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. అసలు ఇరుముడినే అంత హిట్టవుతుందని ఊహించింది ఎంత మంది. సో రవితేజ ఇప్పటికైతే దీపం పద్దతిని ఫాలో అవుతూ రెమ్యునరేషన్ హైక్ పనిలో ఉన్నాడట. మరి హసిత్ గోలి ఎవరితో ప్రొసీడ్ అవుతాడనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇందులో శ్రీవిష్ణు కూడా ఉన్నాడు. ఇదంతా అఫీషియల్ కాదు కానీ ఫిలిం నగర్ టాక్స్ అయితే జోరుగా ఉన్నాయి.