భారత్ ఫార్మాపై ట్రంప్ టారిఫ్ ల్యాండ్ బాంబ్!

భారత ఫార్మా రంగానికి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మైండ్ బ్లాకింగ్ అప్‌డేట్ ఇచ్చారు. జెనరిక్ ఔషధాల దిగుమతులపై దశలవారీగా భారీ సుంకాలను విధించనున్నట్లు ఆయన ప్రకటించారు. 2026 ఆగస్టు 1 నుండి రెండేళ్ల పాటు జీరో శాతం టారిఫ్ ఉంటుందని, 2028 ఆగస్టు నుండి ఏకంగా 100 శాతం, 2029 నుండి 200 శాతం సుంకం అమలు చేస్తామని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఫార్మా కంపెనీలు అమెరికాలోనే ప్లాంట్లు పెట్టి ఉత్పత్తులను తయారు చేయాలనేదే తన ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు.

ఈ నిర్ణయం వల్ల భారతదేశానికి భారీగా నష్టం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రపంచానికే ‘ఫార్మసీ’గా పేరుగాంచిన భారత్, ప్రతి ఏటా అమెరికాకు దాదాపు 9 నుండి 10 బిలియన్ డాలర్ల విలువైన జెనరిక్ మందులను ఎగుమతి చేస్తోంది. అమెరికాలో వాడే మొత్తం జెనరిక్ మందుల్లో దాదాపు 40 శాతం వాటా ఇండియాదే. బిపి, షుగర్, క్యాన్సర్, ఇతర తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన భారతీయ మందులను అక్కడి ప్రజలు ఎక్కువగా వాడుతున్నారు.

పేటెంట్ మందుల కంపెనీలతో పోలిస్తే జెనరిక్ ఔషధాలు తయారుచేసే సంస్థలకు లాభాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో వందల శాతాల్లో పన్నులు పడితే, ఆ భారాన్ని తట్టుకుని తక్కువ ధరలకే మందులు అమ్మడం కంపెనీలకు చాలా కష్టం. రాత్రికి రాత్రే అమెరికాలో ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రొడక్షన్ మొదలుపెట్టడం కూడా ఏ మందుల కంపెనీకి సాధ్యమయ్యే పని కాదు. సండోజ్, తేవా, వయాట్రిస్ లాంటి గ్లోబల్ దిగ్గజాలు కూడా ఈ నిబంధనల వల్ల ఇబ్బందుల్లో పడనున్నాయి.

ప్రస్తుతానికి భారతీయ కంపెనీలకు ఈ సుంకాల నుండి ఏమైనా మినహాయింపు దక్కుతుందా లేదా అనేది ఇంకా క్లియర్‌గా తెలియలేదు. ఇరు దేశాల మధ్య ఇప్పటికే వాణిజ్య పరమైన చర్చలు జరుగుతున్నందున, భారత ప్రభుత్వం ఫార్మా ఎగుమతులపై ప్రత్యేక సడలింపుల కోసం ప్రయత్నించే అవకాశం ఉంది. అయితే బ్రాండెడ్, పేటెంట్ ఉన్న ఔషధాల విషయంలో పాత నిబంధనలే కొనసాగుతాయని అమెరికా స్పష్టం చేసింది. దేశీయంగా తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా ప్రభుత్వం చెప్తున్నా, దీనివల్ల మందుల ధరలు విపరీతంగా పెరిగే ప్రమాదం ఉందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.