ఇస్రో కు షాకిస్తున్న రాజీనామాలు… కట్టడికి కొత్త రూల్స్!

భారతదేశానికి గర్వకారణమైన ఇస్రో లో ఇప్పుడు ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా తమ ఉద్యోగాలకు గుడ్ బై చెబుతుండటంతో ఏం జరుగుతుందో అనే సందేహాలు ఎక్కువవుతున్నాయి. గత కొన్ని నెలల్లోనే సుమారు 100 మంది నుంచి 120 మంది దాకా రాజీనామాలు చేశారని తెలుస్తోంది. మొత్తం 14,600 మందికి పైగా ఉద్యోగులున్న సంస్థలో ఈ సంఖ్య చిన్నదే అయినా, కీలక స్థానాల్లో ఉన్నవారు వెళ్లిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

ముఖ్యంగా గగన్‌యాన్ లాంటి అత్యంత కీలకమైన మిషన్లలో పనిచేస్తున్న వారు ఇందులో ఉండటం గమనార్హం. ఎల్వీఎం-3 ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసెఫ్, స్పేడెక్స్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌తో పాటు చంద్రయాన్-3 విజయంలో ముఖ్య పాత్ర పోషించిన ఆదిత్య రాళ్లపల్లి లాంటి ప్రతిభావంతులు సంస్థను వీడారు. యూఆర్ఎస్సీ కేంద్రం నుంచి 80 మంది, వీఎస్ఎస్సీ నుంచి మరో 20 మందికి పైగా వెళ్లిపోయారు.

ఈ వలసలను అడ్డుకునేందుకు అంతరిక్ష విభాగం రంగంలోకి దిగింది. జులై 14న ఒక కొత్త మెమోరాండం జారీ చేస్తూ రాజీనామాలు, స్వచ్ఛంద పదవీ విరమణ నిబంధనలను బాగా కఠినతరం చేసింది. ముఖ్యమైన జాతీయ ప్రాజెక్టులకు ఆటంకం కలగకుండా ఉండేందుకు గ్రూప్ A కేటగిరీ సైంటిస్టుల రాజీనామాలను ఇకపై అంత తేలిగ్గా ఆమోదించకూడదని నిర్ణయించింది.

2020లో తీసుకొచ్చిన ఒక పాత నిబంధనను కూడా ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి తీసుకుంది. అప్పటి రూల్స్ ప్రకారం సైంటిస్టుల రాజీనామాలను ఆమోదించే అధికారం ఆయా సెంటర్ల డైరెక్టర్లకు ఉండేది. కానీ ఈ నిబంధనల ప్రకారం గగన్‌యాన్ లాంటి ముఖ్యమైన మిషన్లు పూర్తయ్యేదాకా రాజీనామాలను డైరెక్టర్లు ఆమోదించడానికి వీల్లేదు.

ఆయా దరఖాస్తులను నేరుగా అంతరిక్ష విభాగానికే పంపాల్సి ఉంటుంది. ఈ వలసలపై ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ స్పందిస్తూ, ఇలాంటివి ఏ సంస్థలో అయినా సహజమే అని వ్యాఖ్యానించారు. వెళ్లాలనుకునే వారిని ఆపలేమని, కానీ ఒకరు వెళితే ఆ బాధ్యతలను ఇంకొకరు తీసుకునేలా తాము ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. సంస్థలో ప్రాజెక్టులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటామని భరోసా ఇచ్చారు.