790 కోట్ల మోసం… 3 కోట్లు రాబ‌ట్టిన ఈడీ!

దేశాన్ని కుదిపేసిన పోంజీ కుంభ‌కోణం కేసును విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్‌.. చేసిన ప‌ని విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది. ఈ కేసులో ప్ర‌ధాన నిందితుడు అమ‌ర్‌దీప్ కుమార్‌.. ప్ర‌జ‌ల నుంచి 792 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసి.. బోర్డు తిప్పేశాడు. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన ఈడీ అధికారులు ఆయ‌న ఆస్తుల‌ను స్వాధీనం చేసుకున్నారు. కోట్ల రూపాయ‌ల విలువైన ఆస్తుల విష‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క అడుగు కూడా ఈడీ అధికారులు ముందుకు వేయ‌లేక పోయారు. తాజాగా ఓ బుల్లి విమానాన్ని మాత్ర‌మే విక్ర‌యించి.. 3 కోట్ల రూపాయ‌ల‌ను పొందారు.

ఈ సొమ్మునే బాధితుల‌కు పంచ‌నున్న‌ట్టు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ వ్య‌వ‌హారం తీవ్ర విమ‌ర్శ‌ల‌కు దారితీసింది. ముంబైలో వేల కోట్ల‌రూపాయ‌లు విలువ చేసే సొమ్ములు ఉండ‌గా.. వాటి విష‌యంలో చ‌ర్య‌లు తీసుకోని ఈడీ.. హైద‌రాబాద్‌లోని శంషాబాద్‌లో పార్కింగ్ చేసిన బుల్లి విమానాన్ని విక్ర‌యించి 3 కోట్ల రూపాయ‌ల‌ను పొంద‌డం, ఈ సొమ్మునే బాధితుల ఖాతాల్ల లోకి జ‌మ చేస్తామ‌ని చెప్ప‌డం వంటివాటిపై పెద‌వి విరుపులు క‌నిపిస్తున్నాయి. ఈ సొమ్మును ఎవ‌రికి ఏమేర‌కు పంచుతార‌ని.. తాము చేసిన ఖ‌ర్చులో ప‌ది పైస‌ల వంతు కూడా లేద‌ని బాధితులు చెబుతున్నారు.

అమ‌ర్‌దీప్ కుమార్ పోంజీ పేరుతో అధిక వ‌డ్డీలు ఆశ చూపి ప్ర‌జ‌ల నుంచి సొమ్ములు సేక‌రించారు. ఆ త‌ర్వాత‌.. బోర్డు తిప్పేశారు. దీనిపై ఫిర్యాదులు అంద‌డంతో కేసు న‌మోదైంది. అయితే.. అప్ప‌టికే వ‌సూలు చేసిన 792 కోట్ల సొమ్మును విదేశాలు దాటించార‌న్నా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో రంగంలోకి దిగిన ఈడీ వాటిపై విచార‌ణ చేస్తోంది. ఇప్ప‌టికేప‌లు ఆస్తుల‌ను స్వాధీనం చేసుకుంది. వీటిలో స్థిరాస్తుల విష‌యం కోర్టులో ఉండ‌డంతో చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేక పోయింది. ఈ క్ర‌మంలోనే చ‌రాస్తిగా ఉన్న అమ‌ర్‌దీప్ కుమార్ సొంత విమానాన్ని స్వాధీనం చేసుకుంది.

ఈ విమానాన్ని రెండు రోజుల కింద‌ట ఆన్‌లైన్‌లో వేలం పెట్ట‌గా.. దేశానికే చెందిన ఓ ప్ర‌ముఖ వ్యాపార వేత్త రూ.3 కోట్ల‌కు ద‌క్కించుకున్నారు. ఈ సొమ్ము ఈడీ ఖాతాకు జ‌మైన‌ట్టు అధికారులు తెలిపారు. దీనిని బాధితుల‌కు త‌లా కొంచెం పంచుతామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. కానీ, కోట్ల రూపాయ‌ల్లో బ‌కాయిలు ఉన్న నేప‌థ్యంలో ఈ 3 కోట్ల‌ను ఎవ‌రికి ఎంత పంచుతార‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది. సాధార‌ణ ప్ర‌జ‌లు దాచుకున్న సొమ్ముపై హుటాహుటిన దాడులు చేసే ఈడీ అధికారులు.. ఈ విష‌యంలో ఎందుకు తాత్సారం చేస్తున్నార‌న్న ప్ర‌శ్న‌లు కూడా తెర‌మీదికి రావ‌డం గ‌మ‌నార్హం.