భారతదేశ సంస్కృతిలో వివాహాన్ని అత్యంత పవిత్రంగా భావిస్తారు. జీవితంలో ఒక్కసారే పెళ్లి జరుగుతుందని ఇక్కడి ప్రజల్లో అత్యధికులు నమ్ముతారు. అందుకే మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తారు. మేళతాళాలతో వైభవంగా పెళ్లి చేస్తారు. దేవుడు అడుగుపెట్టిన నేలగా చెప్పుకునే కేరళలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురువాయుర్ శ్రీకృష్ణ దేవాలయంలో అద్భుత ఘట్టం చోటు చూసుకోబోతుంది.
కేరళ ప్రజలకు మలయాళ క్యాలెండర్ ప్రకారం చింగం మాసం అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఇది మలయాళ సౌర క్యాలెండర్ లో మొదటి మాసం. ఈ మాసంలో కొత్త ఇంట్లోకి మారడం, కొత్త వాహనం కొనడం, కొత్తగా వ్యాపారం ప్రారంభించడం చేస్తారు. పెళ్లిళ్లకు కూడా ఇది చాలా మంచి ముహూర్తంగా విశ్వసిస్తారు. ఈ మాసంలో కేరళలో అతి పెద్ద పండుగ ఓణం వస్తుంది.
అయితే ఈసారి ఓణం పండుగ కంటే పెళ్లిళ్ల పండుగ పెద్దగా జరగబోతుంది. ఈ నెల 23 వ తేదీన గురువాయుర్ శ్రీకృష్ణ దేవాలయం ప్రాంగాణంలో 377 పెళ్లిళ్లు జరగబోతున్నాయి. 2024 సెప్టెంబర్ 8 వ తేదీన 334 వివాహాలు జరిగాయి. ఇప్పటి వరకు అదే రికార్డుగా వుంది. ఈ రికార్డు ఇప్పుడు బ్రేక్ చేస్తున్నారు కొత్త జంటలు. ఈ పెళ్లిళ్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం వుందని చెబుతున్నారు దేవాలయం నిర్వాహకులు. ఏక కాలంలో 400 పెళ్లిళ్లు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. ఈ భారీ పెళ్లిళ్ల తాకిడిని తట్టుకోవడానికి ఇప్పటినుంచే సన్నాహాలు చేస్తున్నారు.
ఆలయంలో ప్రస్తుతం నాలుగు కళ్యాణ మండపాలు వున్నాయి. ఈ నాలుగు మండపాల్లో ఒకేసారి 200 వివాహాలు చేయడానికి సౌకర్యం వుంది. కనుక మరోకొత్త కళ్యాణ మండపం కట్టడం ఒక్కటే దీనికి పరిష్కారం అని నిర్ణయించారు. ఆఘమేఘాల మీద కొత్త మండపం నిర్మించేందుకు పనులు ప్రారంభించారు. చింగం మొదటి రోజే ఈ మండపాన్ని ప్రారంభించనున్నట్లు కమిటీ పెద్దలు ప్రకటించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates