ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా లేచి చూసే సరికి ఇంటి ఓనర్లు ఆ దొంగ చుట్టూ కర్రలు పట్టుకొని రెడీగా ఉండడం…ఇటువంటి సీన్లు సినిమాల్లో చాలా ఉన్నాయి. ఇదే తరహా సీన్ ఒకటి రీల్ లైఫ్ లో కాకుండా రియల్ లైఫ్ లో కూడా జరిగింది. హైదరాబాద్ లో గంజాయి మత్తులో దొంగతనానికి వెళ్లిన దొంగ అడ్డంగా దొరికిపోయిన ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.
హైదరాబాబ్ లోని పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వాడి- ఏ-ముస్తఫా ప్రాంతంలోని ఓ ఇంట్లో దొంగతనం చేయాలని ఓ దొంగ అనుకున్నాడు. అయితే, ఆల్రెడీ గంజాయి కొట్టిన ఆ దొంగ మత్తులో ఉన్నానన్న సంగతి మరచిపోయినట్లున్నాడు. ఓ ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసిన దొంగ…ఆ తర్వాత మత్తులో చిత్తయి ఆ ఇంట్లోనే నిద్రపోయాడు. కట్ చేస్తే…ఈ లోపు ఇంటి ఓనర్లు వచ్చి గాఢ నిద్రలో ఉన్న దొంగను చూసి షాకయ్యారు. అతడి జేబులో తమ ఇంట్లోని బంగారు నగలు చూసి అవాక్కయ్యారు.
వెంటనే ఆ దొంగకు నిద్రాభంగం కలిగించిన ఇంటి యజమాని…ఆ దొంగ ఎవరు ఏంటి అని వాకబు చేశారు. గతంలో కూడా తమ ఇంట్లో మొబైల్ ఫోన్ చోరీ అయిందని ఆయన తెలిపారు. అయితే, తాను ఆ ఇంటికి సమీపంలోనే ఉంటానని, ఆ ఏరియావాడినేనని దొంగోడు సెలవిచ్చాడు. ఆ వీడియో రికార్డ్ చేసిన తర్వాత ఆ అన్ ప్రొఫెషనల్ దొంగను పోలీసులకు అప్పగించారు. ఇక, కుంభకర్ణుడి కజిన్ లా ఉన్న ఆ దొంగ ఇంకెన్ని ఇళ్లలో దొంగతనం చేశాడోనని పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates