టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన అభిలాష చిత్రం ‘ఉరిశిక్ష’పై ఎంత పెద్ద డిబేట్ కు తెరలేపిందో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. ఆ చిత్రం విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా…ఇప్పటికీ ఉరిశిక్షపై ఇటు మీడియాలో అటు సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతూనే ఉంటుంది.
సభ్య సమాజం తలదించుకునే తప్పులు చేసిన దుర్మార్గులకు ఉరే సరి అని కొందరు…ఇంకా ఆటవిక సమాజంలో మాదిరి ఉరిశిక్ష విధించడం సరికాదని మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. అందుకే, న్యాయమూర్తులు కూడా ఒక ఖైదీకి ఉరిశిక్ష విధించే ముందు చట్టపరమైన ఎన్నో అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. చాలామంది జడ్జిలకు కెరీర్ లో ఉరిశిక్షలు వేసే కేసులు చాలా తక్కువగా వస్తుంటాయి.
ఇటువంటి నేపథ్యంలో ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్కు చెందిన అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ కేవలం 4 నెలల కాలంలో 22 మందికి మరణ శిక్ష విధించడం చర్చనీయాంశమైంది. 10 కేసుల్లో ఇచ్చిన ఆ తీర్పుల నేపథ్యంలో మరణశిక్షల అమలుపై మరోసారి విస్తృత చర్చ మొదలైంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆగస్టు మధ్య కాలంలో ఆయన ఈ తీర్పులను వెలువరించారు. ఏప్రిల్లో ఏడుగురికి, మే నెలలో ఒకరికి, జూన్లో ఇద్దరికి, జూలైలో ఏడుగురికి, ఆగస్టు 13 నాటికి మరో ఐదుగురికి మరణశిక్ష విధించారు.
ఇప్పుడే కాదు, గతంలో బరేలీలో పనిచేస్తున్న సమయంలోనూ 13 మందికి ఉరిశిక్ష విధించిన ట్రాక్ రికార్డ్ ఈయనకు ఉంది. తన పదవీ కాలంలో మొత్తం 35 మందికి డెత్ సెంటెన్స్ విధించడంపై చర్చ జరుగుతోంది. 2022లో వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో వీడియోగ్రాఫిక్ సర్వేకు ఆదేశాలు జారీ చేసింది కూడా ఈయనే. వాస్తవానికి సెషన్స్ కోర్టు విధించిన ఉరిశిక్షల అమలుకు హైకోర్టు ధ్రువీకరణ తప్పనిసరి. ఆ తీర్పులను సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునే చట్టపరమైన వెసులుబాటు నిందితులకు ఉంది. అక్కడ కూడా ఉరిశిక్ష తీర్పును బలపరిస్తే…. ఆ తర్వాత క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతిని వేడుకునే అవకాశం నిందితులకు ఉంటుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates