డబ్బు, బంగారం కోసం ఓ తల్లి తన మైనర్ కొడుకును హత్యలకు ప్రేరేపించిన ఘటన తెలంగాణలో కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక (భూంపల్లి) ప్రాంతంలో తల్లీకొడుకు కలిసి ఇద్దరు మహిళలను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సుమారు రూ.10 లక్షల విలువైన 5.1 తులాల బంగారం, 53 తులాల వెండి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
భూంపల్లి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలో హోటల్, దుకాణం నిర్వహిస్తున్న చాకలి రజిత (38) క్రైమ్ కథనాలు, ఆన్లైన్ వీడియోలు చూస్తూ హత్యలకు పథకం వేసినట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తన మైనర్ కుమారుడిని కూడా నేరాల్లో భాగస్వామిని చేసినట్లు దర్యాప్తులో తేలింది. కుమారుడు శారీరకంగా బలంగా ఉండేందుకు ఇంట్లోనే వ్యాయామ పరికరాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడైంది.
ఒంటరి మహిళను నమ్మించి..
గతంలో ‘రేఖ’ అనే ఒంటరి మహిళను నమ్మించి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం మృతదేహంపై పెట్రోల్ పోసి అచ్చమాయపల్లి అటవీ ప్రాంతంలో తగలబెట్టినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.
ఇటీవల అతికం విజయ (45)ను తమ ఇంటికి పిలిపించిన తల్లీకొడుకు ఆమెను గొంతు పిసికి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం ఆమె వద్ద ఉన్న బంగారాన్ని తీసుకుని, మృతదేహాన్ని ద్విచక్ర వాహనంపై రామక్కపేట శివార్లకు తరలించి కాల్చివేసినట్లు దర్యాప్తులో తేలింది. సగం కాలిన స్థితిలో మృతదేహం లభించడంతో పోలీసులు కేసును ఛేదించే పనిలో నిమగ్నమయ్యారు.
సీసీటీవీ, సాంకేతిక ఆధారాలతో ఛేదింపు
విజయ మృతదేహం లభించిన తర్వాత సిద్దిపేట పోలీసులు సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలను పరిశీలించి నిందితులపై దృష్టి సారించినట్లు సమాచారం. అనంతరం రజితతో పాటు ఆమె మైనర్ కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. రజితను రిమాండ్కు తరలించగా, బాలుడిని జువైనల్ హోమ్కు పంపినట్లు తెలిసింది.
విచారణలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం. మంచానికే పరిమితమైన భర్తకు బీమా చేయించి అనంతరం అతడిని హత్య చేయడంతో పాటు మరో ముగ్గురు మహిళలను కూడా హత్య చేసేందుకు తల్లీకొడుకు పథకం వేసినట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. అయితే ఈ అంశాలపై పోలీసుల అధికారిక ప్రకటనలో మరింత స్పష్టత రావాల్సి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates