ఆధునిక కాలంలో వివాహేతర బంధాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. తన జీవితంలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చిన ప్రియుడి మోజులో పడి కట్టుకున్న భర్తను కడతేర్చిందో మహిళ. ఆపై తన చేతులతోనే చంపేసిన భర్తను పాతిపెట్టేందుకు ఆమె ఏకంగా జేసీబీతోనే గొయ్యి తీసింది. ఆపై భర్త శవాన్ని ఆ గోతిలో పాతిపెట్టి… భర్త కనిపించడం లేదని నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణలో భాగంగా ఆ అర్థాంగే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు తేల్చారు. ఇదెక్కడో జరిగిన ఘటన కాదు. మన తెలుగు నేలలో జరిగిన దారుణ ఘటనే.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలోని సంగారెడ్డి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం ఎల్గోయి మండలం గంగాపూర్ లో జరిగిన ఈ ఘటనపై నారాయణ్ ఖేడ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన వివరాల్లోకి వెళితే… గంగాపూర్ కు చెందిన ముత్యం రెడ్డి దంపతుల మధ్యలోకి చింటూ అనే వ్యక్తి చేరిపోయాడు. ముత్యంరెడ్డి సతీమణి అతడితో వివాహేతర బంధాన్ని మొదలుపెట్టింది. అయితే తమ వివాహేతర బంధానికి అడ్డు వస్తున్నాడని భావించి ముత్యంరెడ్డిని హత్య చేసేందుకు ఆమె సిద్ధపడింది.
అనుకున్నదే తడవుగా… ఈ విషయాన్ని ప్రియుడు చింటుతో పంచుకున్న ఆమె తన భర్తను చంపేందుకు చింటూనూ సిద్ధం చేసింది. ఇంకేముంది… తమకు అనుకూలమైన సమయంలో భర్తను ప్రియుడితో కలిసి ఆమె చంపేసింది. మరి చంపేసిన శవాన్ని ఇంటిలో పెట్టుకోలేరు కదా. శవాన్ని పాతిపెట్టేందుకు తీయాల్సిన గొయ్యి కోసం ఆమె ఏకంగా జేసీబీనే ఆశ్రయించిందట. జేసీబీతో తీసిన గోతిలో ప్రియుడితో కలిసి భర్త శవాన్ని పాతిపెట్టేసింది.
ఆ తర్వాత ఏమీ తెలియనట్లు నారాయణ్ ఖేడ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లిన ఆ మహిళ… తన భర్త కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. ఆ మహిళ ఫిర్యాదు ఆధారంగా మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ముత్యంరెడ్డి కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఆ మహిళపై అనుమానం వచ్చిన పోలీసులు… ఆమెను తమదైన శైలిలో విచారించారు. పోలీసు దెబ్బ పడగానే నిజాన్ని వెళ్లగక్కిన నిందితురాలు జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పేసింది. ప్రియుడితో కలిసి భర్తను చంపేసి… ఆ శవాన్ని పాతిపెట్టేందుకు ఏకంగా జేసీబీతోనే గొయ్యి తీసిన ఆ మహిళను చూసి పోలీసులే షాక్ తిన్నారట.
Gulte Telugu Telugu Political and Movie News Updates