నీట్ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. సుమారు 70 వేల మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతూ కొందరు పేపర్ లీక్ చేసిన వైనం షాకింగ్ గా మారింది. ఈ క్రమంలోనే ఈ నెల 3న జరిగిన నీట్ యూజీ పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మళ్లీ జూన్ 21న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శుక్రవారం వెల్లడించింది.
అయితే ఈ పరీక్షా విధానంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వచ్చే ఏడాది నుంచి నీట్ పరీక్షను ఆన్ లైన్ లో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కీలక ప్రకటన చేశారు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుగుతోందని, నిందితులను కఠినంగా శిక్షిస్తామని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పరీక్ష రద్దు చేశామని అన్నారు. నీట్ పరీక్షను పారదర్శకంగా నిర్వహించడమే తమ ప్రధాన కర్తవ్యమని తెలిపారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ మాల్ ప్రాక్టీస్ జరగకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. రీ టెస్ట్ కోసం విద్యార్థులు నచ్చిన నగరాన్ని ఎంచుకోవడానికి వారం రోజులు గడువు ఇస్తున్నామని తెలిపారు.
జూన్ 14న అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని, నీట్ కోసం మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. సోషల్ మీడియాలో నీట్ పరీక్షపై రకరకాల ఊహాగానాలు, పుకార్లు ప్రచారంలో ఉన్నాయని, వాటిని విద్యార్థులు నమ్మవద్దని ధర్మేంద్ర ప్రదాన్ కోరారు. కేవలం పరీక్ష రాయడంపైనే దృష్టి సారించాలని విద్యార్థులకు సూచించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
