శేషాచలం అడవుల్లో కార్చిచ్చు… ఆకతాయిల పనేనా?

తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుని కలకలం రేపింది. తిరుపతి పరిధిలోని జీవకోన సమీప మొండోడికోన వద్ద ఆదివారం సాయంత్రం చెలరేగిన మంటలు వేగంగా వ్యాపించి సుమారు రెండు కిలోమీటర్ల పరిధిలోని అడవిని దహనం చేశాయి.

మంటలు ఎగిసిపడుతుండటంతో సమీప ప్రాంతాల్లో భయాందోళన నెలకొంది. కాకులమాను అటవీ ప్రాంతం వైపు మంటలు విస్తరించడంతో భక్తులు ఆందోళనకు గురయ్యారు.

సాయంత్రం సుమారు 6:30 గంటల సమయంలో ప్రారంభమైన ఈ అగ్ని ప్రమాదం రాత్రి 9 గంటల వరకు తీవ్రంగా కొనసాగింది. మొండోడికోనలో ప్రారంభమైన మంటలు తిమ్మినాయుడుపాలెం సమీపంలోని ఎర్రచందనం గిడ్డంగుల పరిసర ప్రాంతాల దాకా వ్యాపించాయి. దాదాపు రెండు కిలోమీటర్ల మేర పచ్చని చెట్లు కాలిపోవడంతో అటవీ సంపదకు గణనీయ నష్టం వాటిల్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఎండల తీవ్రతతో మంటలు చెలరేగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ, ఆకతాయిల చర్యల కోణంలోనూ దర్యాప్తు కొనసాగుతోంది.

అటవీ ప్రాంతానికి అత్యంత సమీపంలో ఉన్న కపిలతీర్థం అటవీశాఖ కార్యాలయం పరిధిలోనే ఘటన జరగడం గమనార్హం. అధికారులు అప్రమత్తంగా ఉండి మిగిలిన ప్రాంతాలకు మంటలు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు.