గొడవ వల్ల గడ్డివాము తగలెట్టేసాడంట

నిందితులను పోలీసులు పబ్లిక్‌లో కొట్టడం వంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. అటువంటి సందర్భాల్లో అలా కొట్టడం మానవ హక్కుల ఉల్లంఘన అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతుంటాయి. కానీ కొన్ని సందర్భాల్లో ఇవే ప్రజల మన్నలను పొందుతాయి. తాజాగా అనంతపురం జిల్లాలో ఇటువంటి ఘటన ఒకటి జరిగింది.

గడ్డివాములు తగలబెట్టిన ఘటనలతో రైతుల్లో భయాందోళనలు రేపిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పెద్దవడుగూరు మండలం పరిధిలో గత రెండు వారాలుగా వరుసగా జరిగిన అగ్నిప్రమాదాల వెనుక ఒకే వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల రిపోర్ట్ ప్రకారం, నాగసముద్రం గ్రామానికి చెందిన టపిల పెద్ద పాండురంగడు అలియాస్ సుధాకర్‌ను ఏప్రిల్ 19న అరెస్ట్ చేశారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా అతడిని గుర్తించి, అక్షయ కాలనీ సమీపంలో పట్టుకున్నారు.

గత ఏప్రిల్ 12 రాత్రి వెల్పుల గంగరాజు, అదే రాత్రి జెడ్. వీరారెడ్డి గడ్డివాములు తగలబెట్టగా, ఏప్రిల్ 19న వట్టం రామేశ్వరరెడ్డి గడ్డివాములకు కూడా నిప్పుపెట్టినట్లు పోలీసులు తెలిపారు. జొన్న దుప్పలు, కొర్ర, సామ వాములు దగ్ధమవడంతో సుమారు ₹7 లక్షల నష్టం వాటిల్లింది.

విచారణలో భాగంగా, తగాదాలు ఉన్న వారిపై కక్షతో గడ్డివాములు తగలబెట్టే అలవాటు ఉన్నట్లు నిందితుడు ఒప్పుకున్నాడని పోలీసులు వెల్లడించారు. రెండు నెలల క్రితం తన స్వగ్రామంలో కూడా ఇలాంటి ఘటనలకు పాల్పడినట్లు తెలిపినట్టు పేర్కొన్నారు.

అయితే నిందితుడిని అదుపులోకి తీసుకున్న అనంతరం ఎస్‌ఐ పబ్లిక్‌లో చితకబాదిన ఘటన వివాదాస్పదమైంది. దీనికి సంబంధించిన వీడియో బయటకు రావడంతో పోలీసుల ప్రవర్తనపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై జిల్లా ఎస్‌పీ విచారణకు ఆదేశించారు. చట్టపరమైన చర్యలే తీసుకోవాల్సిన సమయంలో ‘పోలీసు మార్క్ ట్రీట్మెంట్’ సరైనదా అనే చర్చ కొనసాగుతోంది.