దేశంలో విమానయాన సంస్థల గుత్తాధిపత్యానికి చెక్ పెడుతూ.. కేంద్ర ప్రభుత్వం తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఉన్న నిబంధనలను సమూలంగా మారుస్తూ.. కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. దీని ప్రకారం.. విమానయాన సంస్థలు.. ఇక నుంచి తమ సీటింగ్లో 60 శాతం సీట్లపై ఎలాంటి నిర్బంధాలు విధించేందుకు అవకాశం ఉండదు. ఆయా సీట్లను సాధారణ రేట్లకే కేటాయించాలి. అదేవిధంగా ఒకే పీఎన్ ఆర్ నెంబరు ఉన్న సీట్లను పక్కపక్కనే కేటాయించాలి.
అలాగే..సమయం చూసుకుని ధరలు పెంచే విధానానికి కూడా కేంద్రం చెక్ పెట్టింది. ముఖ్యంగా విమానాల్లో విండో, ముందు వరుస, మధ్య వరసుల సీట్లకు ఉన్న డిమాండ్ను విమానయాన సంస్థలు ప్రస్తుతం సొమ్ము చేసుకుంటున్నాయి. ఆయా వరుసల్లో టికెట్లు కొనుగోలు చేస్తున్న వారిపై అదనపు భారం మోపుతున్నాయి. ఇప్పుడు వాటిని పూర్తిగా ఎత్తేయాలని కేంద్రం ఆదేశించింది. అంతేకాదు.. హిడెన్ చార్జీలను పూర్తిగా రద్దు చేయాలని స్పష్టం చేసింది.
అంతేకాదు.. ఇతర సీట్లలోనూ 60 శాతం మేరకు ఎలాంటి అదనపు చార్జీలు విధించడానికి వీల్లేదని స్పష్టం చేయడం గమనార్హం. ఇక, సరుకుల రవాణా విషయంలోనూ ఇప్పటి వరకు మీదే బాధ్యత అంటూ సంస్థలు తప్పించుకుంటున్నాయి. కానీ, ఇకపై సరుకుల భద్రతకు సంస్థలే బాధ్యత వహించాలని కేంద్రం తేల్చిచెప్పింది. విమానాల ఆలస్యం, రద్దు వంటి విషయాలు తలెత్తినప్పుడు.. ఖచ్చితంగా ఆ సమాచారాన్ని ప్రయాణికులకు తెలియజేయాలని.. ప్రాంతీయ భాషల్లోనే సమాచారం అందించాలని కూడా స్పష్టం చేసింది.
ఇటీవల మూడు మాసాల కిందట.. ఇండిగో సంక్షోభం తలెత్తింది. దీంతో ప్రయాణికులు అల్లాడిపోయారు. ఈ పరిణామాలపై నియమించిన కమిటీ చేసిన సూచనల మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం తాజా మార్గదర్శకాలను విడుదల చేసింది. అయితే.. వీటిని విమానయాన సంస్థలు ఏమేరకు అమలు చేస్తాయన్నది ప్రశ్నగా మారింది. ఇప్పటికే ఇంధన ఖర్చులు, నిర్వహణ ఖర్చులు పెరిగిపోయి అల్లాడుతున్నామని చెబుతున్న సంస్థలు.. వీటిని అంగీకరిస్తాయో లేదో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
