మన ‘రూపాయి’ విలువ మరింత పతనమవుతుందా?

ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేస్తున్న యుద్ధం.. భార‌త్‌పై తీవ్ర ప్ర‌భావం చూపిస్తుందా? ప్ర‌జ‌ల‌కు క‌ష్టాలు ప్రారంభం కానున్నాయా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. మ‌రికొద్ది రోజుల్లోనే ఇరాన్ యుద్ధ ప్ర‌భావం.. ప్ర‌పంచ దేశ‌ల‌పై భారీగా ప‌డ‌నుంద‌ని అంత‌ర్జాతీయ విశ్లేష‌కులు చెబుతున్నారు. ముఖ్యంగా 142 కోట్ల మందికి పైగా జ‌నాభా ఉన్న భార‌త్ వంటి దేశంపై ఈ ప్ర‌భావం మ‌రింత ఎక్కువ‌గా ఉండే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

రూపాయి భారీగా..

ఇరాన్‌పై యుద్ధం కార‌ణంతోపాటు.. అమెరికా దూకుడు, ఇజ్రాయెల్ భీష‌ణ ప్ర‌తిజ్ఞ‌ల నేప‌థ్యంలో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న యుద్ధం ఎప్ప‌టికి ముగుస్తుందో తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో పెట్టుబ‌డి దారులు త‌మ పెట్టుబ‌డుల‌ను వెన‌క్కి తీసుకుంటున్నారు. దీంతో భార‌త క‌రెన్సీపై పెను ప్ర‌భావం ప‌డుతోంది. వాస్త‌వానికి గ‌త నెల 28న యుద్ధం ప్రారంభ‌మ‌య్యే నాటికి అమెరికా డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ 87(రూపాయ‌లు)గా ఉండ‌గా.. ఈ నాలుగు రోజుల్లోనే ఏకంగా 5 రూపాయ‌ల వ‌ర‌కు క్షీణించింది. ఫ‌లితంగా బుధ‌వారం నాటికి.. డాల‌ర్‌తో రూపాయి మార‌కం విలువ రూ.92కు చేరింది. ఇది అత్యంత ప్ర‌మాద‌క‌ర సంకేత‌మ‌ని నిపుణులు చెబుతున్నారు.

మార్కెట్లు న‌ష్టం..

మ‌రోవైపు భార‌త స్టాక్ ఎక్సేంజ్‌లు పూర్తిన‌ష్టాల్లోనే కొన‌సాగుతున్నాయి. దేశీయ ఈక్విటీ మార్కెట్లలో భారీ అమ్మకాలు, విదేశీ ఇన్వెస్టర్లు నిధులను ఉపసంహరించుకోవ‌డంతో భార‌త మార్కెట్లు తీవ్ర‌న‌ష్టాలు చ‌విచూస్తున్నాయ‌ని మార్కెట్ వ‌ర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా బంగారం, వెండితో పాటు డాలర్ ప్రాబల్యంతో స్టాక్ మార్కెట్లు మ‌రింత న‌ష్టాల‌ను చ‌విచూడ‌నున్నాయ‌ని ఆ వ‌ర్గాలు తెలిపాయి. బుధ‌వారం నాటి ట్రేడింగ్‌లో `దలాల్ స్ట్రీట్`(బీఎస్ఈ) భారీ పతనాన్ని చవిచూసింది. ఇది ఇప్ప‌టి వ‌ర‌కు జ‌ర‌గ‌ని న‌ష్టంగా వ్యాపార‌వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

మార‌కం విలువ‌.. 100కు చేరువ‌లో!

దేశంలో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఆర్థిక ఒత్తిడి త‌ప్ప‌ద‌ని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు. డాల‌ర్ విలువ క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో పెరుగుతోంద‌ని.. ప్ర‌స్తుతం 92 రూపాయిలుగా ఉన్న మార‌కం విలువ‌.. త్వ‌ర‌లోనే రూ.100కు చేరుతుంద‌ని చెబుతున్నారు. ఇది అన్ని రంగాల‌పైనా తీవ్ర ప్ర‌భావం చూపిస్తుంద‌ని అంటున్నారు. అంతర్జాతీయ లావాదేవీలన్నీ డాలర్ మీదే ఆధారపడి ఉండ‌డం.. కేంద్ర ప్ర‌భుత్వానికి నిధులు మ‌రింత అవ‌స‌రం అవుతాయ‌ని చెబుతున్నారు. మ‌రోవైపు.. అన్ని నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు పెర‌గ‌నున్నాయ‌ని వాణిజ్య వ‌ర్గాలు చెబుతున్నాయి.