టెకీ ఆత్మ‌హ‌త్య‌.. ఇంత మూఢ‌న‌మ్మ‌క‌మా?

ఎంత నేర్చినా.. ఎంత వార‌లైనా.. ఇప్ప‌టికీ మూఢ‌న‌మ్మ‌కాల‌కు, రాశిఫ‌లాల‌కు, జ్యోతిష్యాల‌కు దాసులుగా నే వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆదివారం రాగానే.. ప‌త్రిక‌ల్లో వ‌చ్చే వార్త‌ల‌కంటే కూడా.. ఆయా ప‌త్రిక‌ల్లో వ‌చ్చే రాశిఫ‌లాల‌ను న‌మ్ముతున్న వారి సంఖ్యే ఎక్కువ‌గా ఉంద‌ని ఇటీవ‌ల ఓ ప‌రిశోధ‌న తెలిపింది. ఇక‌, ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ అనే తేడా లేకుండా.. జ్యోతిష్యాలు చెప్పించుకునేవారు కూడా పెరిగిపోతున్నారు. పోనీ.. ఇవేవైనా నిజంగానే జ‌రుగుతాయ‌న్న న‌మ్మ‌కం ఉందా.. అంటే ఆ చెప్పే వారే న‌మ్మ‌కం లేద‌ని చెబుతారు!.

అలాంటి జ్యోతిష్యాన్ని న‌మ్మి.. సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే.. ఆమెకు 9 రోజుల కింద‌టే వివాహం జ‌రిగింది. దీంతో ఇప్పుడు ఆమె కుటుంబం స‌హా.. మెట్టినింటి వారు సైతం శోక‌సంద్రంలో మునిగిపోయారు. మూఢ‌న‌మ్మ‌కాలు వ్య‌క్తుల‌పై ఎంత బ‌ల‌మైన ముద్ర వేస్తాయో చెప్ప‌డానికి క‌ర్ణాట‌క‌లో తాజాగా జ‌రిగిన ఈ ఘ‌ట‌న అద్దం పడుతోంది.

ఏం జ‌రిగింది?

బెంగ‌ళూరులోని కొడ‌గు ప్రాంతానికి చెందిన‌ 29 ఏళ్ల విద్యాజ్యోతి స్థానికంగా ఓ ప్ర‌ముఖ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. నెల‌కు రెండు ల‌క్ష‌ల‌పైచిలుకు జీతం సంపాయించుకుంటున్నారు. అయితే.. ఆమెకుఎంత‌కీ వివాహం కాక‌పోవ‌డంతో ఓ జ్యోతిష్యుడిని సంప్ర‌దించ‌గా.. “నీకు పెళ్లి అవుతుంది. కానీ, 9వ రోజు నీకు మ‌ర‌ణం త‌ప్ప‌దు“ అని గుండె ప‌గిలే మాట చెప్పాడు. దీనికి కొన‌సాగింపుగా.. ప‌రిహారం కూడా సూచించారు. పెళ్ల‌యిన త‌ర్వాత‌.. భ‌ర్త‌కు దూరంగా ఉంటూ.. అమ్మ‌వారికి పూజ‌లు చేయాల‌ని.. చివ‌రి రోజు అంటే.. 9వ రోజు మెడ‌లో తాళి తీసి..అమ్మ‌వారికి సమ‌ర్పిస్తే.. అప్పుడు దోషం పోతుంద‌న్నాడు.

జ్యోతిష్యుడు చెప్పిన‌ట్టుగానే.. జ్యోతికి వివాహం అయింది. దీంతో 9వ రోజు టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఈ నేప‌థ్యంలో భ‌ర్త‌ను దూరం పెట్టి.. ఆ 9 రోజులు పూజ‌కు చేరువైంది. 8 రోజులుగా ఉప‌వాసం ఉంటూ.. పూజ‌లు చేసింది. ఇక‌, 9వ రోజు.. తాళిని అమ్మ‌వారికి స‌మ‌ర్పించాల్సిన స‌మ‌యంలో అన్ని క్ర‌తువులు పూర్తి చేసి.. ఓ గ‌దిలోకి వెళ్లి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. ఈ ఘ‌ట‌న క‌ర్నాట‌క‌లో తీవ్ర క‌ల‌క‌లం సృష్టించింది. మ‌రోవైపు.. జ్యోతిని రెచ్చగొట్టిన జ్యోతిష్యుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు గాలిస్తున్నారు.