భారత స్టాక్ మార్కెట్కు ఈ వారం మరో చాలెంజ్ ఎదురైంది. గత శుక్రవారం సెన్సెక్స్ 961 పాయింట్లు, నిఫ్టీ 318 పాయింట్లు పడిపోయి ఇన్వెస్టర్లకు షాక్ ఇచ్చాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం, ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. ఈ పరిణామాలు సోమవారం మార్కెట్ ఓపెన్ అయినప్పుడు కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రధానంగా ఐదు అంశాలు ఈ వారం మన మార్కెట్ దిశను నిర్ణయించబోతున్నాయి.
మొదటిది ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ప్రత్యక్ష యుద్ధం. ఇరాన్ కీలక నేతల మరణంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు భయాందోళనలో ఉన్నారు. రెండో అంశం ముడి చమురు ధరలు. ఇరాన్ పై దాడుల వల్ల పెట్రోల్, డీజిల్ సరఫరాకు ఆటంకం ఏర్పడితే ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంది. భారత్ తన చమురు అవసరాల కోసం సగానికి పైగా ఇరాన్ మీదున్న సముద్ర మార్గం పైనే ఆధారపడుతుంది కాబట్టి, ఇది మన ఆర్థిక వ్యవస్థకు పెద్ద తలనొప్పిగా మారనుంది.
ఇక మార్కెట్లు పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశం ఉంది. యుద్ధ వాతావరణం వల్ల సోమవారం మార్కెట్ ఓపెన్ అవ్వగానే వీటి రేట్లు భారీగా పెరగవచ్చు. మరోవైపు అమెరికా మార్కెట్లలో ఐటీ షేర్లు బలహీనంగా ఉండటం కూడా మన నిఫ్టీ ఐటీపై ప్రభావం చూపిస్తుంది. ఈ వారం ఆటోమొబైల్, ఫైనాన్స్ రంగాల షేర్లలో ఒడిదుడుకులు ఎక్కువగా ఉండవచ్చు.
అయితే ఒక పాజిటివ్ అంశం ఏంటంటే.. చాలా కాలం తర్వాత విదేశీ ఇన్వెస్టర్లు ఫిబ్రవరిలో భారత మార్కెట్లో సుమారు 2.44 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టారు. కానీ ఈ యుద్ధ పరిస్థితుల దృష్ట్యా వారు మళ్ళీ వెనక్కి తగ్గుతారా లేక వేచి చూస్తారా అనేది కాలమే సమాధానం ఇవ్వాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates